సౌత్ ఇండియా నంబర్ వన్ మహేష్

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనత సాధించాడు. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ సాధ్యం కాని మైలురాయిని చేరుకున్నాడు. ట్విట్టర్లో అతడి ఫాలోవర్ల సంఖ్య కోటికి చేరుకుంది. దక్షిణాదిన ఇప్పటిదాకా ఏ ఫిలిం సెలబ్రెటీ కూడా 10 మిలియన్ ఫాలోవర్ల మార్కును అందుకోలేదు.

సౌత్‌లో చాలా ముందు నుంచి ట్విట్టర్లో ఉండటమే కాదు.. చాలా యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా ట్వీట్లు వేసే హీరోల్లో మహేష్ ఒకడు. అతను 2009లోనే ట్విట్టర్లో చేరాడు. చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ట్విట్టర్ గురించి పెద్దగా అవగాహన లేకముందే మహేష్ రెగ్యులర్‌గా ట్వీట్లు వేశాడు.

అతను ట్విట్టర్లోకి వచ్చిన ఐదారేళ్లకు కానీ మిగతా స్టార్లు అటు వైపు చూడలేదు. దక్షిణాదిన తమిళ కథానాయకుడు ధనుష్ మాత్రమే ట్విట్టర్లో మహేష్‌కు దీటుగా ఉన్నాడు. అతడి ఫాలోవర్ల సంఖ్య 9.1 మిలియన్లుగా ఉంది.

సౌత్‌లో వీళ్లిద్దరి తర్వాతి స్థానంలో ఉన్నది ఒక హీరోయిన్ కావడం విశేషం. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. సమంత అక్కినేని. ఆమెను 80 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇటీవలే అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి 6 మిలియన్ల మార్కును దాటడం విశేషం. ఇంతకుముందు సమంతతో పోటీగా ఫాలోవర్లతో దూసుకెళ్లిన త్రిష 5.2 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 5.7 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నారు.

కేవలం రాజకీయ అంశాల మీద మాత్రమే ట్విట్టర్లో స్పందించే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకు చేరువ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళిని అనుసరిస్తున్న వారి సంఖ్య ఇటీవలే 50 లక్షల మార్కును టచ్ చేసింది. లేటుగా ట్విట్టర్లోకి వచ్చిన అల్లు అర్జున్ 4.7 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు. ఈ మధ్యలో ట్విట్టర్లో అడుగు పెట్టిన చిరు ఫాలోవర్ల సంఖ్య 6 లక్షలకు చేరువగా ఉంది.