టిక్ టాక్ ఆగిపోయింది.. ఇక మ‌ళ్లీ రాదు

మ‌న ద్వారా ఆదాయం పొందుతూ.. ఆ ఆదాయాన్ని మ‌న సైనికుల్ని దెబ్బ తీసేందుకు, మ‌న ప్ర‌త్య‌ర్థుల‌కు సాయ‌ప‌డేందుకు వినియోగిస్తున్న చైనాను దెబ్బ కొట్టాల‌న్న ఉద్దేశానికి తోడు.. మ‌న స‌మాచారం ఆ దేశానికి చేర‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో 59 ఆ దేశ యాప్‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించిన సంగ‌తి తెలిసిందే. మిగ‌తా యాప్‌ల గురించి జ‌నాల‌కు పెద్ద‌గా ప‌ట్టింపు లేదు కానీ.. టిక్ టాక్ విష‌యంలో మాత్రం కోట్లాది మందిలో ఆందోళ‌న నెల‌కొంది. రోజూ గంటలు గంట‌లు టిక్‌టాక్ చేస్తూ, చూస్తూ గ‌డిపేవారికి ఇది మింగుడుప‌డ‌ని విష‌య‌మే. ఐతే బ్యాన్ అయితే చేశారు కానీ.. ఆల్ర‌డీ మొబైళ్ల‌లో ఉన్న యాప్‌ను ఏం చేయ‌లేర‌నే ఆలోచ‌న‌లోనే ఉన్నారు మెజారిటీ జ‌నాలు.

నిన్న నిషేధం ప్ర‌క‌టించాక మ‌రుస‌టి రోజు కూడా టిక్ టాక్ య‌ధావిధిగా వ‌స్తుండ‌టంతో దాని యూజ‌ర్లు ప్ర‌శాంతంగానే ఉన్నారు. కొత్తగా యాప్ డౌన్ లోడ్ మాత్రమే ఉండ‌ద‌ని అనుకున్నారు. కానీ సాయంత్రానికి వాళ్లంద‌రికీ పెద్ద షాక్ త‌గిలింది. టిక్ టాక్ యాప్ ఆగిపోయింది. ఆ యాప్ ఓపెన్ చేయ‌గానే నెట్ వ‌ర్క్ ఫెయిల్యూర్ అనే మెసేజ్ వ‌స్తోంది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీలే ఆ యాప్ ప‌ని చేయ‌కుండా బ్రేక్ వేసేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాము ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా మార్పు చేసుకుని తిరిగి వ‌స్తామంటూ టిక్‌టాక్ నుంచి కూడా ఓ మెసేజ్ డిస్‌ప్లే అవుతోంది కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌ద‌న్న‌ది నిపుణుల మాట‌. టిక్ టాక్ చ‌రిత్ర ముగిసింద‌ని వాళ్లు స్ప‌ష్టం చేస్తున్నారు. రిప్ టిక్ టాక్ అంటూ సోష‌ల్ మీడియాలో ఒక ట్రెండ్ కూడా న‌డుస్తోంది. నిషేధించిన యాప్‌లు దేశానికి మంచివి కావ‌ని కేంద్రం స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ఉంద‌ని.. ఆ యాప్‌ల ద్వారా చైనాకు డేటా వెళ్తోంద‌నే ప‌క్కా ఆధారాలు ఉండ‌టంతోనే నిషేధానికి పూనుకుంద‌ని నిపుణులంటున్నారు. కాబ‌ట్టి టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయాలు చూసుకోక త‌ప్ప‌ద‌న్న‌ట్లే.