ఆర్జీవీ.. ఇది మాత్రం దారుణం సార్

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో తనకు నచ్చిన అంశం మీద సినిమాలు తీసి పడేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎంచుకునే కథలన్నీ వివాదాస్పదంగానే ఉంటాయి. మీడియాలో బాగా నానిన విషయాన్ని తీసుకుని సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. అలాగే సినిమా తీశాక కూడా మీడియాలో దేనికి బాగా పబ్లిసిటీ వస్తుందో చూసుకుంటాడు.

వర్మ సినిమాల క్వాలిటీ ఏంటో ఈ మధ్యే రిలీజైన ‘క్లైమాక్స్’, త్వరలోనే రాబోతున్న ‘నేక్డ్’ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆయన ‘క్వాలిటీ’ అనే మాటకు తిలోదకాలు ఇచ్చేసి దశాబ్దం దాటిపోయింది. ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా.. డైహార్డ్ ఫ్యాన్సే చీదరించుకున్నా వర్మ ఏమీ పట్టించుకోడు. తన సినిమాల పట్ల జనాల్లో ఆసక్తిని రగల్చడానికి ఏదో ఒక గిమ్మిక్ చేస్తూ సాగిపోతుంటాడు. ఈ కోవలోనే ఆయన ‘మర్డర్’ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు.

మిర్యాలగూడలో సంచలనం రేపిన అమృత ప్రేమ వ్యవహారం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. ఐతే ఆల్రెడీ భర్తను కోల్పోయి.. ఈ మధ్యే తండ్రినీ దూరం చేసుకుని తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటోంది అమృత. ఆ ఇద్దరి మరణాలకూ కారణం తనే అంటూ సొసైటీ నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతనూ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఆమె మీద సినిమా తీయడం ఎంత వరకు సబబన్నది వర్మ ఆలోచించాలి. ఇదే విషయమై వర్మకు అమృత ఒక లేఖ కూడా రాసింది.

తనకు ఏడుద్దామన్నా కన్నీళ్లు రాని పరిస్థితి అని.. ఇప్పటికే తన జీవితం తల్లకిందులైందని.. ప్రాణంగా ప్రేమించిన భర్తను పోగొట్టుకుని, తండ్రిని కూడా దూరం చేసుకుని.. ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొని జీవితాన్ని వెళ్లదీస్తున్నానని.. ఇలాంటి సమయంలో వర్మ ఈ సినిమా ద్వారా సమాజం కళ్లు మళ్లీ తనపై పడేలా చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఐతే వర్మ దీనిపై స్పందిస్తూ.. ఎప్పట్లాగే తనదైన లాజిక్కులతో ట్వీట్లు వేస్తున్నాడు. ఐతే రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసి ఎలా అయినా సమర్థించుకోవచ్చు కానీ.. ఒకటికి రెండు విషాదాలు చూసి నరకం అనుభవిస్తున్న అమ్మాయి మనోభావాల్ని అర్థం చేసుకోకుండా ఇలా సినిమా తీసి సొమ్ము చేసుకోవడం మాత్రం దారుణం అన్నది మెజారిటీ అభిప్రాయం.