బీసీ ముఖ్యమంత్రి కావాలి: బ్ర‌ద‌ర్ అనిల్

ఏపీ సీఎం జ‌గ‌న్ చెల్లెలు భ‌ర్త‌, ప్ర‌ముఖ సువార్త ప్ర‌సంగీకుడు, బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఏపీ స‌ర్కారుపై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు.  రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని  అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్ప‌టికీ తీరలేదని అన్నారు. క్రైస్తవ సంఘాలు, బీసీ, మైనారిటీలకు చెందిన వ్యక్తులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి తనను పిలిచారని, వారి బాధలు విన్నాన‌ని అన్నారు.

ఒక్క అవకాశం అంటే తాము అన్ని పార్టీలనూ వదిలి జగన్ కు మద్దతు తెలిపామని తనను కలిసిన వారు చెప్పినట్లు అనిల్ వివరించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని తెలిపారని బ్రదర్ అనిల్ అన్నారు. ఎన్నికలలో జగన్ కు సపోర్టు చేస్తే వారి సమస్యలు తీరుస్తానని తాను హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దేవుడిని నమ్మే తాను అసత్యాలు మాట్లాడలేనని, తాను ఇచ్చిన మాట చెల్లుబాటు కానందున ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని వినకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని అన్నారు.

వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకు వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాలలో బ్రదర్ అనిల్ ప్రభావం వల్ల, ఆయన ఇచ్చిన మాట వల్ల తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశామని బ్రదర్ అనిల్ తో సమావేశం అయిన వారు చెప్పారు. బ్రదర్ అనిల్ మద్దతు లేకపోతే 70 స్థానాలలో ఈ ఫలితాలు వచ్చేవి కాదని వారన్నారు.

“నేను రాజకీయ విషయాలు మాట్లాడను. నేనెప్పుడూ అసెంబ్లీ వైపు వెళ్లేవాడిని కాదు. నా బిజీలో నేను.. పథకాల బిజీలో సీఎం ఉన్నారు. అన్ని సమస్యలూ సీఎం దృష్టికి తీసుకెళ్తా. నేను సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయింది. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారు.. వారికి మద్దతుగా ఉంటా. ఎన్నికల ముందు నన్ను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది.“ అని అనిల్ చెప్పారు.

వివేకా హ‌త్య‌పై..

వివేకా హత్య కేసుపైనా స్పందించిన బ్రదర్ అనిల్.. దోషులు తప్పించుకోలేరని అన్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోందంటే చిన్న విషయం కాదని అన్నారు. త్వరలోనే దోషులెవరో తెలనుందని తెలిపారు. సీబీఐ అత్యంత పెద్ద ఆర్గ‌నైజేష‌న్ అని.. నేర‌స్తులు త‌ప్పించుకోలేర‌ని.. అనిల్ చెప్పారు. అయితే.. త‌న‌కు ఈ కేసు గురించి ఏమీ తెలియ‌ద‌ని అన్నారు. తను పెద్ద‌గా ఈ కేసును ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు.