కొత్త సీఎం.. పంజాబ్‌లో కీల‌క నిర్ణ‌యాలు

ఇంకా.. పాల‌న ప్రారంభించ‌లేదు. ముఖ్య‌మంత్రిగా ఎవ‌రూ ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌లేదు. కానీ.. పంజాబ్‌లో భారీ మెజారిటీ సాధించిన ఆప్.. ఆమ్ ఆద్మీ పార్టీ.. మాత్రం సంచ‌ల‌న నిర్ణ‌యాల దిశ‌గా దూసుకుపోతోంది. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ వాహనాలు పోలీస్ స్టేషన్లకు వెళ్లిపోయాయని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండొద్దని.. భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు మాత్రమే ఉండాలని మాన్ ఆదేశించారు. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమృత్సర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్కు నిజాయితీ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని   కేజ్రీవాల్ అన్నారు.

“నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్కు నిజాయితీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాన్ చాలా నిజాయితీపరుడు. ప్రభుత్వానికి వచ్చే రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం.“ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్కు చెందిన రాజకీయ నేతగానీ, ఎమ్మెల్యే గానీ ఏదైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. పంజాబ్లోని దిగ్గజ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్జీత్ సింగ్ చన్నీ, బిక్రమ్ సింగ్ మజితియాను ప్రజలు ఓడించి ఇంటికి పంపారని అన్నారు. కేవలం మాన్ ఒక్కరే కాదని.. పంజాబ్లోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రేనన్నారు కేజ్రీవాల్.

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు కైవసం చేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్కలన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, తాజాగా ముఖ్య‌మంత్రిగా కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే మాన్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌జ‌లు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. “ఇది క‌దా.. తాము కోరుకున్న‌ది!“ అంటూ నెటిజ‌న్లు జోరుగా స్పందిస్తున్నారు.