ప్రకంపనలు రేపుతున్న చిన్న సినిమా

ది కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. మొన్న శుక్రవారమే ఈ చిత్రం రిలీజైంది. అప్పుడు దీని మీద పెద్ద డిస్కషన్లేమీ లేవు. అందరూ ‘రాధేశ్యామ్’ యుఫోరియాలో మునిగిపోయి ఉన్నారు. ఆ భారీ చిత్రం గురించే అంతా చర్చించుకున్నారు. ఐతే తొలి రోజు ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల వరకు బలంగానే నిలబడ్డా.. దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లో, అలాగే ఉత్తరాదిన ‘రాధేశ్యామ్’కు స్పందన అంతంతమాత్రంగానే ఉంది.

ఇది ‘ది కశ్మీర్ ఫైల్స్’కు అడ్వాంటేజ్‌గా మారింది. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రానికి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అంతకుమించి సినిమా చూసిన ప్రేక్షకుల మౌత్ టాక్ బాగా కలిసొచ్చి సినిమా వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు స్క్రీన్లు, షోల సంఖ్య.. బుకింగ్స్.. వసూళ్లు.. ఇలా అన్నీ పెరిగిపోయాయి.

శనివారం నాటికి ఇది కల్ట్ మూవీ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడు సినిమాకు నార్త్ ఇండియా టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. రిలీజైన మూడో రోజు, ఆదివారం.. ఉదయం 6-6.30 మధ్య షోలు మొదలుపెట్టడం విశేషం. ఈ సినిమా కోసం డిమాండ్ ఆ స్థాయిలో పెరిగిపోయింది. ఈ రోజు మొత్తం నార్త్ ఇండియాలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ హౌస్ ఫుల్స్‌తో రన్ కాబోతోంది. దక్షిణాదిన కూడా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది.

పరిమిత స్క్రీన్లలోనే బాగా ప్రభావం చూపిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనాకు తోడు కొన్ని వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టడంతో రిలీజ్ ఆలస్యమైంది. విడుదల ముంగిట సెన్సార్ బోర్డు దగ్గర సమస్యలు తప్పలేదు. అనేక వివాదాస్పద విషయాలను చర్చించడంతో చాలా సన్నివేశాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముందు చాలా కట్స్ పడగా.. రివైజ్డ్ కమిటీ దగ్గరికెళ్లాల్సి వచ్చింది. అయినా కూడా చివరికి కొన్ని కోతలతోనే సినిమా బయటికి వచ్చింది.