జైల్లో నుండే పోటీ చేసి గెలిచారు

ఒకపుడు జైలులో శిక్ష అనుభవిస్తూ పోటీ చేసి గెలిచిన నేతలున్నారు. జైలులో ఉన్నపుడు ప్రచారం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వీళ్ళ తరపున ప్రచార బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియ మొత్తానికి ఎవరో ఒకరు చూసుకునే వారు. నేతలపైన అభిమానం ఉన్న వాళ్ళుంటే ఓట్లేసి గెలిపిస్తారు లేకపోతే లేదు. జైల్లో నుండే నామినేషన్లు వేసి గెలిచిన జార్జి ఫెర్నాండెజ్ లాంటి  నేతలున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు ఇలాగే జైల్లో ఉండే పోటీ చేసి గెలిచారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన అజాంఖాన్, నహిద్ హసన్ జైల్లో నుండే నామినేషన్లు వేయటమే కాదు గెలిచారు కూడా. అది కూడా మామలూగా కాదు మంచి మెజారిటితో గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. అజంఖాన్, నహిద్ హసన్ ఏమీ దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసమో పోరాడి జైల్లో శిక్షను అనుభవించటం లేదు.

వీళ్ళద్దరు అసాంఘీక శక్తులుగా ముద్రపడిన వారే. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, భూకబ్జాలు, హత్యలు, కిడ్నాపుల్లాంటి అనేక కేసుల్లో ఇరుక్కుని పోలీసులకు దొరికిపోయారు. వీటిల్లో కొన్ని ఆరోపణలు రుజువ్వవటంతో కోర్టు వీళ్ళద్దరికీ శిక్షలు కూడా విధించింది. రాంపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన అజంఖాన్ ప్రస్తుతం సీతాపూర్ జైలు నుండి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనాను 55 వేల ఓట్ల తేడాతో అజంఖాన్ ఓడించారు.

అలాగే కైరానా నియోజకవర్గంలో పోటీ చేసిన నహిద్ హసన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మృగాంకా సింగ్ పై 25 వేల ఓట్ల కుపైగా మెజారిటితో గెలిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జైలులో ఉండే వీళ్ళద్దరు గెలిచారంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతోంది ? అనేక నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిసీ జనాలు వీళ్ళద్దరికీ ఎలా ఓట్లేశారు?. నేరాలు చేసి శిక్షలు అనుభవిస్తున్నా సరే వీళ్ళకు జనాలు ఓట్లేశారంటే వీళ్ళపై పోటీచేసిన బీజేపీ అభ్యర్ధుల చరిత్ర ఏమిటి ? బయట ఉండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల కన్నా జైల్లో ఉన్న వాళ్ళే నయమని జనాలు అనుకున్నారా ? హేమిటో జనాలు ఎవరికి ఎందుకు ఓట్లేస్తారో కూడా అర్థం కావటం లేదు.