రాధే శ్యామ్ ‘100’ టికెట్లు పంపండి.. బెజవాడ మేయర్ లేఖ!

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం వాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందులోకి విజయవాడ లాంటి బడా సిటీకి నగర మేయర్ గా ఉండటం అంటే మాటలా? చెప్పండి. అందుకే కాబోలు తన సత్తా అందరూ మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. బెజవాడ టౌన్ లోని మల్టీఫ్లెక్సుల యజమానులకు ఆమె రాసిన లేఖ గురించి తెలిసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎందుకంటే.. అందులో విషయం అలాంటిది మరి.
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తన లెటర్ హెడ్ మీద థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు లేఖలు పంపారు. దాని సారాంశం ఏమంటే.. కొత్త సినిమా రాధే శ్యామ్ విడుదల సందర్భంగా మొదటి రోజున ప్రతి షోకు వంద చొప్పున టికెట్లు విత్ అవుట్ ఫెయిల్ పంపాలని కోరారు. పార్టీ కార్పొరేటర్లు.. నాయకులు.. కార్యకర్తలు సినిమా టికెట్లు అడుగుతున్నారని అందుకే తమకు పంపాలని ఆమె కోరారు.

అయితే.. అందుకు అయ్యే ఖర్చు లెక్కను చెల్లిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బెజవాడ సిటీలోని అన్ని థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు ఆమె ఇదే రీతిలో లేఖ రాయటం.. అది కాస్తా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మహానగరానికి మేయర్ అయ్యాక కూడా సినిమా టికెట్లను అడుగుతుంటే.. లేదని చెప్పటం ఆమెకు నచ్చలేదన్నట్లుంది. అందుకే.. నేరుగా థియేటర్ యజమానులకు.. మల్టీఫ్లెక్సులకు ఆమె లేఖ రాసి పంపారు.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో వచ్చిన అబ్లిగేషన్ కు ఎలా రియాక్టు కావాలో అర్థం కావట్లేదంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు మేయర్ స్థానంలో ఉన్న వారు ఎవరూ కూడా ఇలా సినిమా టికెట్లు గురించి అధికారికంగా లేఖ రాసింది లేదని చెప్పొచ్చు. మొత్తానికి మేయర్ ఆఫీస్ నుంచి థియేటర్లకు వచ్చిన రిక్వెస్టు కమ్ వార్నింగ్ పోలిన లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.