బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయి: రాజా సింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

యూపీ సీఎం యోగి గెలుపును యావత్ భారత్ కోరుకుందని , తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు వస్తాయని రాజాసింగ్ అన్నారు. దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఉక్కుపాదం మోపారని, ప్రజా సంక్షేమానికి కృషి చేశాడని కొనియాడారు. కేసీఆర్ కలలోకి కూడా మోడీ వస్తున్నారని, అందుకే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఖతం అవుతుందని షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ అని, డబ్బులిస్తారా…? అభ్యర్థిని నిలబెట్టమంటారా? అంటూ బెదిరిస్తుందని ఆరోపించారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. ఎంఐఎం‌ తమకు రాజకీయ శత్రువని స్పష్టం చేశారు.

కాగా, యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని, బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని యూపీ ఎన్నికలకు ముందు ఇదే తరహాలో రాజాసింగ్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని రాజాసింగ్ హెచ్చరించడంపై వివాదం రేగింది.