నిరుద్యోగుల థ్యాంక్స్ కేసీఆర్‌కా? ప్ర‌శాంత్ కిషోర్‌కా?

తెలంగాణ‌లో కొంత కాలంగా ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు చెప్పారు. ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తు వ‌చ్చిన ఆయ‌న ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ ఎప్ప‌టి వ‌ర‌కూ సాగుతుందో తెలీదు కానీ మొత్తానికి కేసీఆర్ నుంచి ఆ ప్ర‌క‌ట‌న రావ‌డంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనికి వాళ్లు సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాలా? లేదా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌కు థ్యాంక్స్ చెప్పాలా? అనే చ‌ర్చ మొద‌లైంది.

ఇన్నాళ్లుగా నాన్చి..
అదిగో నోటిఫికేష‌న్లు.. ఇదిగో నోటిఫికేష‌న్లు అంటూ కేసీఆర్ ప్ర‌భుత్వం ఇన్ని రోజులు నిరుద్యోగుల‌తో ఆడుకుంది. నోటిఫికేష్ల అంశాన్ని ఎన్నిక‌ల అస్త్రంగా వాడుకుంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా మొద‌ట‌గా ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్నే ప్ర‌స్తావిస్తూ ఓట్లు పోగేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది. 50 వేలు, 60 వేలు, 80 వేల ఉద్యోగాల భ‌ర్తీ అంటూ కాల‌యాప‌న చేసింది. నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్ర‌హం, ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క‌సారిగా 90 వేల‌కు పైగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీని వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంద‌ని విశ్లేష‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఆయ‌న స‌ల‌హాతోనే..
అవును.. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌ట‌న వెన‌క మ‌రొక‌రు ఉన్నార‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఆయ‌నే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్‌. కేసీఆర్ కోసం రాష్ట్రంలో పని చేస్తున్న ఆయ‌న స‌ల‌హాతోనే కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న చేశార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. లేక‌పోతే ఇప్ప‌ట్లో కేసీఆర్ నోటిఫికేష‌న్ల జోలికి వెళ్లేవాడే కాద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు పీకే బృందం స‌ర్వేలు నిర్వ‌హించింది.

అందులో వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తేలింది. అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారు. అందుకే వాళ్ల‌ను ముందు శాంత ప‌ర్చ‌డం కోసం ఇప్పుడు ఇలా ఉద్యోగ భ‌ర్తీల ప్ర‌క‌ట‌న చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తుండడంతో ముందుగానే నిరుద్యోగుల‌కు గాలం వేసేందుకు కేసీఆర్ ఈ ప్ర‌క‌ట‌న చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ల‌కూ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న రావ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న నిరుద్యోగులు దాని వెన‌కాల ఉన్న పీకేకు మ‌న‌సులోనే ధన్య‌వాదాలు చెప్పుకుంటున్నారు.