కేసీయార్ పై రెచ్చిపోతున్న బీజేపీ

నాలుగు రాష్ట్రాల్లో విజయం కారణంగా తెలంగాణాలో బీజేపీ నేతలు కేసీయార్ పై రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తామేనంటు నానా రచ్చ మొదలుపెట్టేశారు. ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం వేరు తెలంగాణాలో గెలవటం వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోయారు. పైగా ఇప్పటికే కేసీయార్ పై బీజేపీ నేతలు రెచ్చిపోతు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.

ఇలాంటి నేపధ్యంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆగుతారా ? జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని, నరేంద్రమోడికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుకంటున్న కేసీయార్ కు చుక్కలు చూపిస్తామంటు బీజేపీ నేతలు అప్పుడే వార్నింగులిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేసేంత సీన్ కమలనాదులకు లేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో సంస్ధాగతంగా పార్టీకి అసలు బలమే లేదు. కాకపోతే జనాలు ప్రత్యామ్నాయం కోసం చూసినపుడు పార్టీకి సంస్ధాగతంగా బలముందా లేదా అన్నది చూడరు.

దీనికి ఉదాహరణ 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లలో గెలవటమే. కేసీయార్ కూడా తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుని డైరెక్టుగా మోడీపైనే రెచ్చిపోతున్నారు. మోడికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో వేదికను ఏర్పాటు చేస్తానని పదే పదే చెప్పి నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను వరుసగా కలుస్తున్నారు. అయితే వారిలో ఎందరినుండి మద్దతొచ్చిందనే విషయంలో క్లారిటిలేదు.

ఇప్పటికైతే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నుండి మాత్రమే కేసీయార్ కు మద్దతొచ్చిందట. ఇంతోటిదానికే మోడికి వ్యతిరేకంగా కేసీయార్ రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లేవే. ఇందుకనే బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేయటం ఖాయమంటు రచ్చ మొదలుపెట్టేశారు. ఇప్పటికే రోజుకో సమస్యను తీసుకుని కేసీయార్ ను ఊపిరి ఆడనీయటంలేదు. కాబట్టి   ఆ ఎన్నికలేదో తొందరగా వచ్చేస్తే బాగుండి గోల తగ్గుతుంది.