ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. టాప్ 5 లేటెస్ట్ అప్డేట్స్

ఉక్రెయిన్ – రష్యాల మధ్య జరుగుతున్న యద్ధం పదకొండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకునే దిశగా రష్యా దళాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అలా అని.. ఉక్రెయిన్ ఆస్తుల్నిను నాశనం చేయటంతో పాటు.. వారి ఆర్థిక మూలాలు.. ప్రజల ప్రాణాలతో పాటు సైనిక సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బ తీసే విషయంలో రష్యా అంతకంతకూ ముందుకు వెళుతూనే ఉంది.

మరోవైపు.. రష్యా సైన్యానికి ఉక్రెయిన్ల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత.. వారికి ఎదురవుతున్న సవాళ్లు ఎక్కువగానే ఉంటున్నాయి. రష్యాను నిలువరించటానికి వీలుగా నాటో నుంచి పెద్ద ఎత్తున సాయాన్ని ఉక్రెయిన్ ఆశిస్తోంది. యుద్ధ విమానాల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే.. దీనిపై స్పష్టమైన హామీ అగ్రరాజ్యం నుంచి రావట్లేదు.
ఆదివారం చోటు చేసుకున్న టాప్ 5 అప్దేట్స్ చూస్తే..

— ఎవరి వైపు ఎన్ని ప్రాణాలు పోయాయి? ఎంత నష్టం జరిగింది?

తాజా యుద్ధంలో ఎవరు ఎంతమందిని పోగొట్టుకున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు వచ్చిన రిపోర్టులకు భిన్నంగా తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం యుద్దం కారణంగా సామాన్య ఉక్రెయిన్లు ఎంతమంది మరణించారన్న దానిపై ఒక నివేదిక వెల్లడించింది. మార్చి 4 వరకు జరిగిన రష్యా దాడుల కారణంగా 351 మంది సామాన్య పౌరులు మరణించినట్లు తెలిపింది. అదే సమయంలో 707 మంది గాయపడ్డారని. వారిలో 36 మంది పిల్లలు ఉన్నట్లు తేల్చారు. వాస్తవ లెక్కలు ఇంతకంటే ఎక్కువే ఉంటుందని చెబుతోంది.

ఇదిలా ఉంటే.. తమ సైనిక పోరులో రష్యా ఇప్పటివరకు 10వేల మంది సైనికుల ప్రాణాల్ని పోగొట్టుకున్నట్లుగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సంచలన వ్యాఖ్య చేశారు. అయితే.. ఇందులో వాస్తవం ఎంతన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. కొన్ని డజన్ల కొద్ది యుద్ధ విమానాలను.. వందలాది ఆయుధ వాహనాల్ని సైతం రష్యా కోల్పోయినట్లుగా ఆయన చెబుతున్నారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ కు భారీ నష్టం వాటిల్లుతున్నా.. పోరాటం విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. రష్యా వాదన మరోలా ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్ కు చెందిన 2203 మిలిటరీ కేంద్రాల్ని ధ్వంసం చేసినట్లుగా ప్రకటించింది.

— ఉక్రెయిన్ అధ్యక్షుడితో బైడెన్ ఏం మాట్లాడారు?

అమెరికాకు చెందిన చట్టసభ సభ్యులతో వీడియో కాల్ లో దాదాపు గంటసేపు మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అవుతుందని వ్యాఖ్యానించటం తెలిసిందే. తాను కీవ్ లోనే ఉన్నట్లు చెప్పిన ఆయన భావోద్వేగ ప్రసంగం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. దాదాపు అరగంట పాటు వారి మధ్య ఫోన్ సంభాషణ సాగింది. ఉక్రెయిన్ కు కావాల్సిన ఆర్థిక.. సైనిక సాయంపైన మాట్లాడారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఎంతవరకు వచ్చాయన్న దానిపైనా బైడెన్ అడిగి తెలుసుకున్నారు.

— ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ చేసిన సాయం

యుద్దం మొదలైన తర్వాత రష్యా జరిపిన దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్.. ఫోన్ లైన్ సేవలు అందుబాటులో లేవన్న సంగతి తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ సమస్యను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవల్ని అందుబాటులోకి తేవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు థ్యాంక్స్ చెప్పారు.

— రష్యా అష్టదిగ్బందనం

ఉక్రెయిన్ మీద సైనిక చర్య చేపట్టిన రష్యాకు షాకుల మీద షాకులు ఇవ్వటానికి వీలుగా నాటో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే విదేశీ ఆస్తులతో పాటు.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేలా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తంగా రష్యాను అష్టదిగ్భందనం చేసేందుకు వీలుగా చర్యలు మొదలయ్యాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటుంటే.. యుద్ధం చేస్తున్నరష్యాకు సైతం అంతే భారీగా నష్టం వాటిల్లుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

— మరింతగా మనోళ్లకు తీసుకొచ్చేస్తున్నారు

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ పేరుతో ఇప్పటికే వేలాది మందిని స్వదేశానికి తీసుకురావటం తెలిసాందే. తాజాగా ఆదివారం ఉదయం ఉక్రెయిన్ నుంచి 183 మంది భారత విద్యార్థుల్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ రోజున (ఆదివారం) మరో 2200 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా భారత్ కు తెచ్చేందుకు ప్రయత్నాలు భారీ ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే.