మరుగుదొడ్లకు టార్గెట్టా.. జగన్‌పై కొత్త ట్రోల్స్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడ్డ మాట వాస్తవం. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు ఎంత ఎదురుదాడి చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితి జనాలకు అర్థమైపోతోంది. అభివృద్ధి కుంటు పడి, ఆదాయం పడిపోయి ప్రభుత్వాన్ని నడపడమే కష్టమైపోతోంది. నెపాన్నికేవలం కరోనా మీద నెట్టడానికి కూడా వీల్లేదు.

ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాలు వెతుకుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే చెత్త పన్ను వేయడం.. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో జనాల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు వసూలు చేయడం, చేపల దుకాణాలు తెరవడం లాంటివి చేశారు. వీటన్నింటిపైనా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ పడ్డాయి. అయినా జగన్ సర్కారు తీరేమీ మారలేదు.

ఇప్పుడు గుంటూరు నగర పరిధిలో ఆదాయం కోసం అక్కడి అధికార వర్గాలు పెట్టుకున్న టార్గెట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మరుగుదొడ్ల నుంచి రోజువారీ, నెలవారీ ఇంత ఆదాయం రావాలంటూ టార్గెట్లు పెట్టి రెవెన్యూ సిబ్బందికి అధికారిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఒక్కో మరుగుదొడ్డి బాధ్యతను వీఆర్వోలకు అప్పగిస్తూ.. రోజుకు దేని దగ్గర ఎంత ఆదాయం రావాలో నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన జీవో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.

ఫలానా మరుగుదొడ్డి.. అది ఉన్న పంచాయితీ పరిధిలో ఉన్న సెక్రటరీ పేరు.. అలాగే దాని బాధ్యత చూడాల్సిన వీఆర్వోపేరు.. చివరగా రోజువారీ ఆదాయ లక్ష్యం నిర్దేశిస్తూ గుంటూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనుకుంటే.. ఇలా మరుగుదొడ్ల ఆదాయానికి టార్గెట్లు పెడతారా.. మొన్న భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల దగ్గర కాపలాకు పెట్టిన వీఆర్వోలకు ఇప్పుడు ఈ బాధ్యతలు ఇచ్చారా అంటూ జగన్ సర్కారుపై కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.