తెలంగాణలో ఏం చేస్తావు పీకే?

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మామూలోడు కాదు. ఆయన ఎంట్రీ ఎక్కడ ఇచ్చినా.. అక్కడ ఆయన కోసం విజయం హారతిపళ్లెం పట్టుకొని మరీ సిద్దంగా ఉంటుందని చెబుతుంటారు. అందుకు తగ్గట్లే.. ఆయన ట్రాక్ రికార్డును చూస్తే.. ఇది నిజమనించక మానదు. తాను అడుగు పెట్టిన ఏ రాష్ట్రమైనా సరే.. ఆ రాష్ట్రంలో తాను సలహాలు ఇచ్చే పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లేలా ప్లానింగ్ చేస్తుంటారు.
అలాంటి ఆయన గత ఎన్నికల్లో ఏపీలోని వైసీపీకి అండగా నిలవటమే కాదు.. విజయాన్ని అందించి.. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపిస్తున్నజగన్మోహన్ రెడ్డి కలను తీర్చారు.

దీంతో.. రాష్ట్రం ఏదైనా.. నాయకుడు ఎవరైనా.. పీకే ఎవరి పక్షాన నిలబడి ఆట ఆడతారో.. వారి ఆట గెలవటమే కాదు.. టైటిల్ సైతం సొంతం చేసుకున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. పీకే ప్లానింగ్ గురించి.. ఆయన ఎత్తుగడల గురించి చాలా మంది గొప్పలు చెబుతుంటారు. నిజంగానే అంత భారీగా పీకే ఆలోచనలు ఉంటాయా? అంటే కాస్తంత సందేహమే.
ఆయన గతంలో కొన్ని రాష్ట్రాల్లోని పార్టీలకు పని చేసిన సందర్భంలో ఆయన ప్లానింగ్ ను గమనిస్తే.. ఒక అంశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ మధ్యనే ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిసిందే. వీధి పోరాటానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మోడీషాలు ఒకపక్క.. మమతా బెనర్జీ మరోపక్క వ్యవహరించిన తీరును మర్చిపోలేం. అసెంబ్లీ ఎన్నికల వేళ.. మరీ ఇంత రచ్చనా? అన్నట్లుగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సాగాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

బెంగాల్ ఎన్నికల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవటం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలు విరగటం.. విరిగిన కాలుకు పెద్ద కట్టు కట్టుకొని వీల్ ఛైర్ లోనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం.. అయ్యో దీదీకి ఎంత కష్టం వచ్చిందన్న భావన కలిగేలా చేయటమేకాదు.. దానంతటికి దుష్ట.. దుర్మార్గ మోడీ అండ్ కో అన్న విషయం బెంగాలీల మనసుల్లో రిజిస్టర్ కావటం.. అంతిమంగా మమతమ్మ మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే.. కమలనాథులకు బెంగాల్ అన్నది అందని ద్రాక్షగా మారింది.

మరికాస్త వెనక్కి వెళితే.. తమిళనాడు సీఎం కుర్చీలో కూర్చోవాలన్న చిరకాల వాంఛను తీర్చుకోవటం కోసం ఎంతో ఆశగా చూస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ స్వప్నాన్ని పూర్తి చేయటంలోనూ పీకే కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. డీఎంకేకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన.. అందుకు తగ్గట్లే తన ఎత్తులతో అన్నాడీఎంకే – బీజేపీ కూటమికి దారుణ ఓటమిని రుచి చూపించారు. స్టాలిన్ ను సీఎం చేసే క్రమంలో.. పీకే ఆయన సానుభూతి వెల్లువెత్తేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. తమిళనాడులో పళని స్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొనే క్రమంలో నాటి విపక్ష నేత స్టాలిన్ చొక్కా తిరగటం.. బొత్తాలన్నీ ఊడిపోయి.. చిరిగిన చొక్కాను అలానే ఉంచుకొని.. తనకు ఎదురైన దారుణ అవమానాన్ని దిగమింగుకొని.. రాజభవన్ కు వెళ్లి.. గవర్నర్ కు ఫిర్యాదు చేయటం తెలిసిందే. తన పట్ల అధికారపక్ష సభ్యులు అనుచితంగా వ్యవహరించిన వైనాన్ని ఆయన ఏకరువు పెట్టారు. చిరిగిన చొక్కాతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయన.. అలానే గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన వైనం ఆయనపై బోలెడంత సానుభూతిని పొంగేలా చేయటమే కాదు.. తమిళ తంబీలు ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటంలో ఈ ఉదంతం కీలకంగా మారిందని చెప్పాలి.

ఈ రెండు ఘటనలు ఇలా ఉంటే.. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు ప్రత్యేక వ్యూహరచనన చేసిన పీకే తెలివితేటలకు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పీకే తెలివికి.. మేధస్సుకు పులకరించిపోయిన పరిస్థితి. పీకే.. ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తారో.. సదరు పార్టీ అధినేతకు ఏదో ఒక ప్రమాదం కానీ.. మరేదో ఆపద కానీ ముంచుకురావటం రివాజు. జగన్ విషయంలోనూ అలానే జరిగిందన్నది మర్చిపోకూడదు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై కోడి కత్తితో దాడి చేయటం.. మెడకు తగలాల్సిన కత్తిని.. సెకనులో వెయ్యో వంతులో జగన్ స్పందించటంతో.. కత్తి వేటు భుజానికి తగలటం.. దానికి కట్టు వేయటం.. కోడి కత్తి వ్యవహారం పెను సంచలనంగా మారటమే కాదు.. జగన్ ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదే? అన్న భావన ఏపీ ప్రజల్లో కలగటమే కాదు.. ఎన్నికల ఫలితాలు హిస్టరీ క్రియేట్ అయ్యేలా రావటం తెలిసిందే. ఇలా.. పీకే తాను ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తారో.. ఆ రాజకీయ పార్టీ అధినేతకు ఏదో ఒక అనూహ్య ఘటన ఎదురు కావటం తెలిసిందే. తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యత చేపట్టిన నేపథ్యంలో.. ఆయనకు మరెలాంటి ఆపద.. కష్టం.. ఎదురవుతుందన్నది ఇప్పుడు పెద్ద టెన్షన్ గా మారిందన్న మాట రాజకీయ వర్గాల్లోని కొందరి నోట వినిపిస్తుండటం గమనార్హం.