తెలంగాణ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌పై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోమారు అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. రాజ‌కీయ నాయ‌కులైనా… అధికారులైనా టార్గెట్ చేయాల‌నుకోవ‌డం ఆల‌స్యం విరుచుకుప‌డే రేవంత్ తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌పై మండిప‌డ్డారు. బీహార్‌లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకుని తిరుగుతారని వ్యాఖ్యానించిన‌ రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి బీహార్ బ్యాచ్‌ను దింపారని కామెంట్ చేశారు.

బీహార్ బ్యాచ్ వచ్చి తెలంగాణ‌ రాష్ట్రాన్ని ఏలుతున్నారని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఛీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్, ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్, రజత్ కుమార్, ఐపీఎస్ అంజనీ కుమార్ అంతా బీహార్ వాళ్లేనని, వాళ్లకు ఒక్కొక్కరికి ఐదారు శాఖలున్నాయని, కేసీఆర్ పూర్వికులు కూడా బీహార్ వాళ్లేనని వ్యాఖ్యానించారు.

బీహార్ ముఠా ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడిందని రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కేసీఆర్‌కు కనిపించడం లేదని ఆరోపించారు. పాలమూరు బిడ్డ ప్రవీణ్కుమార్, మరో ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ పాలన నచ్చకే రాజీనామా చేశారని, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ల మాదిరిగా పీకే, ప్రకాష్రాజ్ వచ్చి తిరుగుతున్నారని, వంద మంది పీకేలు, ప్రకాష్రాజ్లు వచ్చినా ఏం పీకలేరంటూ రేవంత్ రెడ్డి క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ భజన బ్యాచ్ పదేపదే నదులకు నడక నేర్పించాం, ఉచిత విద్యుత్, కేజీ టు పీజీ విద్య అని భజన చేస్తున్నారని, ఇంత చేస్తే ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు.