పవన్ మాటల్నే నిజం చేసిన జగన్

ఇటీవల నరసాపురంలో జరగిన మత్స్యకార అభ్యున్నత సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విశ్లేషణ చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎంత స్థాయి వ్యక్తులైనా సరే.. తన దగ్గరికి వచ్చి సాయం కోసం అభ్యర్థించాలని.. అలా అడిగితే ఆయన ఇగో శాటిస్ఫై అవుతుందని అన్నాడు పవన్.

పరోక్షంగా చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరంచాలని ఏపీ సీఎంను చేతులు జోడించి ఇదేమైనా రాజరికమా అంటూ ప్రశ్నించారు కూడా. ఇప్పుడు మంత్రి పేర్ని నాని వెల్లడించిన విషయం చూస్తే.. జగన్ గురించి పవన్ చెప్పిన మాట అక్షర సత్యం అనిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా రిలీజ్‌కు ముందు సీఎం అపాయింట్మెంట్ కావాలని తనను అడిగారని.. ఈ విషయం జగన్‌కు చెబితే.. ఆయనకు ఏం కావాలో అది చేసి పెట్టమని సీఎం తనకు చెప్పారని.. తాము ఆ సినిమాను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదని నాని చెప్పుకొచ్చారు.

ఐతే బాలయ్య అంటే వ్యక్తిగతంగా జగన్‌కు అభిమానం అని.. యుక్త వయసులో బాలయ్య సినిమాలంటే పడి చచ్చేవారని ఒక ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ అభిమానం వల్లో.. ‘అఖండ’ సినిమా ముంగిట తన అపాయింట్మెంట్ అడిగారనో ఆయనకు ఏం కావాలో అది చేయాలని జగన్ చెప్పినట్లున్నారు.

కాబట్టే ‘అఖండ’ సినిమాకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేసినా చూసీ చూడనట్లు ఉంది యంత్రాంగం. గత ఏడాది కాలంలో బెనిఫిట్ షోలు పడ్డ ఏకైక చిత్రం అదే కావడం గమనార్హం. దాని తర్వాత వచ్చిన ‘పుష్ప’కు కానీ, ఇప్పుడు ‘భీమ్లా నాయక్’కు కానీ బెనిఫిట్ షోలు పడలేదు. ముఖ్యంగా పవన్ సినిమా విషయంలో టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమంటే.. బాలయ్య పట్ల జగన్‌కు సానుకూల భావన ఉంది కాబట్టి, పైగా బాలయ్యే స్వయంగా జగన్ అపాయింట్మెంట్ కోరాడు కాబట్టి ఆ సినిమాకు మినహాయింపు ఇచ్చారు. బాలయ్య అడిగాడు కాబట్టి ఆ సినిమాకు మేలు చేకూర్చారు. పుష్ప, భీమ్లా నాయక్ చిత్రాలకు అడగలేదు కాబట్టి వాటికి ఛాన్స్ లేదు. పవన్ అంటే అస్సలే పడదు కాబట్టి ఆ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వం ఈ స్థాయిలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే జనాలకు దాని మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది?