రియల్ ఎస్టేట్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

రియల్ ఎస్టేట్ వర్గాల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఆసక్తికరంగా మారింది. పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. నిజానికి రియల్ ఎస్టేట్ వర్గాల్లోనే కాదు.. సామాన్య.. మధ్యతరగతి వారి జీవితాల్లోనూ ఈ తీర్పు ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది? దాని ప్రభావం ఎలా ఉండదనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గుర్తింపు లేని.. అనధికార లే అవుట్లలోని ప్లాట్లు.. ఇళ్లు.. ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని పలువురు సబ్ రిజిస్ట్రార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నాన్‌-ఆథరైజ్డ్‌ లేదా నాన్‌-అప్రూవ్డ్‌ లే అవుట్‌లోని ప్లాట్లు, ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు, బదిలీ, గిఫ్ట్‌ తదితర డీడ్స్‌ను రిజిస్టర్‌  చేసేందుకు వీలుగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం తీర్పును ఇచ్చింది. దీనికి కారణం ఏమంటే.. గతంలో అనధికార.. గుర్తింపు లేనిలే ఔట్లలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు వీల్లేని రీతిలో ఒక మెమోను రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ విడుదల చేశారు. ఈ ఆదేశాల్నిజారీ చేస్తూ దాదాపు 5 వేల వరకు పిటిషన్లు హైకోర్టులో రిజిస్టర్ అయ్యాయి.
ఇందులో 11 పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ కేసులకు సంబంధించి కామన్ ఆర్డర్ ను తాజాగా ఇచ్చింది.

సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్ పీలో వచ్చే తీర్పునకు లోబడి రిజిస్ట్రేషన్ ఉంటుందనే విషయాన్ని సబ్ రిజిస్ట్రార్లు.. రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొలని స్పష్టం చేసింది.అన్ని కేసులకు ఇవే ఆదేశాలు జారీ కానున్నట్లుగా ఉత్తర్వులను సవరించింది. అయితే.. ఈ తీర్పు అందరికి వర్తించదు. ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తారో.. వారికి సంబంధించిన వివరాల్ని సరి చూసుకొని ఆదేశాల్ని ఇస్తారు. గుర్తింపు లేని లేఅవుట్లలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ను నిషేధించే మెమోను గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పు పట్టి.. చట్ట విరుద్ధంగా మెమో జారీ అయ్యిందని పేర్కొంది.

అయితే.. తాజా ఆదేశాలన్ని కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులో తీర్పునకు లోబడి ఉంటుందని.. దానికి తగ్గట్లే రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయనే విషయాన్ని రిజిస్ట్రేషన్ పత్రాల్లో స్పష్టం చేయాలని ధర్మాసనం తన తీర్పులో సూచన చేసింది. అయితే.. ఇలాంటి వాటి విషయంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా తియ్యటి మాటలు చెప్పి.. కోర్టు ఆదేశాల్ని తప్పుగా చెబుతూ.. వివాదాస్పద స్థలాల్ని అమాయకులకు అంగట్టే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే.. అవగాహన లేకుండా.. మాటలు నమ్మేవారు నట్టేట మునిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.