బీజేపీని తిడుతున్నా.. టీఆర్ఎస్‌ను పొగిడేసిన ప‌వ‌న్‌

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తులు ఉండ‌డం స‌హ‌జ‌మే. ఎన్నిక‌ల్లో విజ‌యం కోస‌మో త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మో.. ఇలా పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. ఇలా బంధం ఏర్పరుచుకున్న రెండు పార్టీలు క‌లిసిక‌ట్టుగా ఒకే మాట మీద సాగుతాయ‌ని తెలిసిందే. విమ‌ర్శ‌లైనా.. ఆరోప‌ణ‌లైనా.. కౌంట‌ర్లైనా త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీల మీద క‌లిసిక‌ట్టుగా దాడి చేస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు ఓ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. త‌మ మిత్ర‌ప‌క్షాన్ని తిడుతున్న పార్టీని మ‌రో పార్టీ నాయ‌కుడు పొగ‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ రెండు పార్టీలు జ‌న‌సేన‌, బీజేపీ. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ను. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పొగ‌డ్తల్లో ముంచెత్త‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

బీజేపీకి దూరంగా..
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శిస్తూ ప్ర‌ధాని మోడీ ప‌నితీరును ఎండ‌గ‌డుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేత‌లు కూడా బీజేపీపై నోరేసుకుని ప‌డిపోతున్నారు. మ‌రోవైపు బీజేపీ కూడా దీటుగానే బ‌దులిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన‌.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత కాలం నుంచే బీజేపీకి దూరంగా జ‌ర‌గాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌న్న వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజా ప‌రిణామాలు వాటికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. త‌మ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న టీఆర్ఎస్‌ను ప‌వ‌న్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్త‌డం ఇప్పుడు బీజేపీ నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింది.

జ‌గ‌న్‌కు చుర‌క‌లు..
“సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్స‌హిస్తున్నారు. క‌ళ‌ను అక్కున చేర్చుకుని అభినందించ‌డానికి ప్రాంతీయ‌, కుల‌, మ‌త భేదాలు ఉండ‌వ‌ని మ‌రోసారి తెలియ‌జేసినందుకు ఆయ‌నకు ధ‌న్య‌వాదాలు. బ‌యో ఆసియా స‌ద‌స్సు నేప‌థ్యంలో బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ భీమ్లానాయ‌క్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను క‌ళ‌ల‌కు, సంస్కృతికి అంట‌నీయ‌క‌పోవ‌డం తెలంగాణ రాజ‌కీయ నేత‌ల శైలిలో ఉంది. అది కేటీఆర్‌లో ప్రస్ఫుటంగా క‌నిపిస్తోంది”.. ఇవీ ప‌వ‌న్ చేసిన తాజా వ్యాఖ్య‌లు.  వీటిని ప‌రిశీలిస్తే ప‌రోక్షంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ప‌వ‌న్ చుర‌క‌లు పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను క‌ళ‌ల‌కు, సంస్కృతికి అంట‌నీయ‌క‌పోవ‌డం తెలంగాణ రాజ‌కీయ నేత‌ల శైలిలో ఉంద‌ని ప‌వ‌న్ అన్నారు. అంటే ఏపీలో ప‌వ‌న్పై క‌క్ష్య‌పూరితంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు సీఎంను ఉద్దేశించి చెప్పిన‌ట్లే అనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.