భీమ్లాతో పండ‌గ చేసుకుంటున్న వైసీపీ!

పోయినేడాది వ‌కీల్ సాబ్‌.. ఇప్పుడేమో భీమ్లా నాయ‌క్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఈ చిత్రాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న జ‌గ‌న్ స‌ర్కారు ఎలా ఉక్కుపాదం మోపిందో అంద‌రికీ తెలుసు. వ‌కీల్ సాబ్‌కు ఉన్న‌ట్లుండి టికెట్ల రేట్లు త‌గ్గించేసి, స్పెష‌ల్ షోలేవీ ప‌డ‌కుండా చూసి ఆ సినిమాను గ‌ట్టి దెబ్బే తీసింది వైసీపీ ప్ర‌భుత్వం. ఇప్పుడు భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది.

టికెట్ల రేట్లు త‌గ్గిస్తూ ఇచ్చిన జీవోను వేరే సినిమాలకు అంత గ‌ట్టిగా ఏమీ అమ‌లు చేయ‌ట్లేదు. నిన్న‌టిదాకా డీజే టిల్లు సినిమాకు ఏపీలో ఓ మోస్త‌రు రేట్ల‌కే అమ్ముతూ వ‌చ్చారు. కానీ భీమ్లా నాయ‌క్ సినిమాకు వ‌చ్చేస‌రికి అధికార యంత్రాంగ‌మంతా దిగిపోయింది. వైసీపీ నాయ‌కులైతే స‌రేస‌రి. ప‌ట్టుబ‌ట్టి త‌క్కువ రేట్ల‌కు టికెట్లు అమ్మిస్తున్నారు. ఎంత చిన్న సెంట‌రైనా, పంచాయితీల్లో అయినా ఈ రోజుల్లో 10, 20 రూపాయ‌ల రేట్ల‌తో టికెట్లు అమ్ముతున్నారంటే ఏమ‌నాలి?

ఐతే ఇలా టికెట్ల రేట్లు త‌గ్గించి ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న సినిమాను నమ్ముకున్న అంద‌రినీ ఇబ్బంది పెట్టి సంతోషం పొంద‌డ‌మే కాదు.. వైసీపీ నాయ‌కుల‌కు ఇంకో ర‌కంగా కూడా ప్ర‌యోజ‌నం ద‌క్కుతోంద‌న్న‌ది అక్క‌డి జ‌నాల మాట‌. ప్ర‌భుత్వం చెప్పిన రేట్ల‌కు వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున టికెట్ల‌ను కొని.. ఆ త‌ర్వాత అంత‌కు 10, 20 రెట్ల రేటుతో బ్లాక్‌లో అమ్ముతున్నార‌ట‌. ఇందుకోసం ఎక్క‌డిక‌క్క‌డ పెద్ద బృందాలు త‌యారైన‌ట్లు జ‌న‌సేన నాయ‌కులు, ప‌వ‌న్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌తో కూడా కుమ్మ‌క్కై ఇలా బ్లాక్ టికెట్ల దందాను న‌డిపిస్తున్నార‌ట‌. కానీ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మాత్రం ప్ర‌భుత్వం నిర్దేశించిన రేటు ప్ర‌కార‌మే లెక్క‌లు చూపిస్తారు. ఆ మేర‌కే డ‌బ్బులు క‌డ‌తారు. ఏపీ అంత‌టా భీమ్లా నాయ‌క్ సినిమాకు పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ల దందా న‌డుస్తోంద‌ని.. రాయ‌ల‌సీమ‌లో ఇది మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. ఈ విష‌య‌మై జ‌న‌సేన నాయ‌కులు టీవీ డిబేట్ల‌లో కూడా ఆరోప‌ణ‌లు గుప్పిస్తుండ‌టం గ‌మ‌నార్హం.