పులివెందుల అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో అనూహ్య సంఘటన జరిగింది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుండగానే చంద్రబాబునాయుడు పులివెందుల అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమీక్ష జరిగింది. ఈ సమయంలోనే పార్టీ తరపున నాలుగుసార్లు పోటీచేసి, రాజీనామా చేసిన సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా కొందరు ప్రస్తావించారు.

దానికి చంద్రబాబు స్పందిస్తూ పార్టీలోకి ఎవరొచ్చినా సరే రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేది బీటెక్ రవి మాత్రమే అని ప్రకటించారు. ప్రస్తుతం బీటెక్ రవి ఎంఎల్సీగా పనిచేస్తున్నారు. మరెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) ఇపుడు పులివెందులకు ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. బీటెక్ రవికి నేతలంతా ఏకతాటిపై మద్దతుగా నిలబడి బలోపేతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పారు.

పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. వైఎస్ కుటుంబంపై టీడీపీ తరపున సతీష్ రెడ్డే వరుసగా  నాలుగు సార్లు పోటీచేసి ఓడిపోయారు. పులివెందులలో జగన్ను ఓడిస్తామంటు ఏకంగా పులివెందులకే వెళ్ళి చంద్రబాబు రెండు మూడుసార్లు చాలెంజ్ చేసినా సాధ్యం కాలేదు.

బహుశా వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించి తీరాలన్న పట్టుదల చంద్రబాబులో పెరిగిపోయినట్లుంది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు జగన్ పక్కా స్కెచ్ తో పావులు కదుపుతున్నారు. అందుకనే చంద్రబాబు కూడా పులివెందులకు బీటెక్ రవిని అభ్యర్ధిగా రెండున్నరేళ్ళకు ముందే ప్రకటించేసింది. పోటీ చేయటం ఖాయమని తెలిసిన నేతలను కూడా అభ్యర్ధులుగా చివరి నిముషం వరకు ప్రకటించకుండా నాన్చడం చంద్రబాబుకు బాగా అలవాటు. అలాంటిది రెండున్నరేళ్ళకు ముందే అభ్యర్ధిని ప్రకటించారంటే టీడీపీ తరపున వైఎస్ సునీత పోటీ చేస్తుందని జరిగిన ప్రచారం ఉత్త ప్రచారమనే తేలిపోయిందా ?