మళ్లీ రమ్మంటున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్

కరోనా మూడో వేవ్ లేకుంటే ఈపాటికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల థియేట్రికల్ రన్ ముగిసిపోయి ఉండేది. ఆ సినిమాల అనుభూతుల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కానీ కొవిడ్ మరోసారి విజృంభించడంతో ఈ చిత్రాలను వాయిదా వేయక తప్పలేదు. జనవరి 7కు షెడ్యూల్ అయిన ఆర్ఆర్ఆర్, 14న రావాల్సిన ‘రాధేశ్యామ్’ చిత్రాలకు డిసెంబర్లోనే బుకింగ్స్ ఓపెన్ చేశారు ఓవర్సీస్ సెంటర్లలో. ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల అమ్మకాలు చాలా జోరుగా సాగాయి కూడా.

విడుదలకు కొన్ని వారాల ముందే ప్రి సేల్స్‌తో ఆ చిత్రం మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. కరోనా కేసులు పెరిగాక కూడా కచ్చితంగా జనవరి 7నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఒక దశలో పట్టుదలతో ఉంది రాజమౌళి అండ్ కో. అందుక్కారణం ఓవర్సీస్‌లో టికెట్ల అమ్మకాలు పెద్ద ఎత్తున జరగడమే. కానీ దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపు తప్పడంతో చివరికి సినిమాను వాయిదా వేయక తప్పలేదు.

దీంతో ఆ టికెట్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. రాధేశ్యామ్ పరిస్థితీ అదే అయింది.ఐతే కరోనా ప్రభావం తగ్గడంతో ఆర్ఆర్ఆర్‌ను మార్చి 25న, రాధేశ్యామ్ మూవీని మార్చి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డేట్లలో మార్పులేమీ లేనట్లే ప్రస్తుతానికి. దీంతో ఇక ఈ చిత్రాల ఓవర్సీస్ ప్రిమియర్స్‌కు రంగం సిద్ధమవుతోంది. ముందు ఒప్పందాలు చేసుకున్న సెంటర్లలో తిరిగి టికెట్ల అమ్మకాలు మొదలవుతున్నాయి. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ టికెట్లు కొని ఇబ్బంది పడ్డ ప్రేక్షకులకు మళ్లీ పిలుపునిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తిరిగి వారిని సినిమాకు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు.

విడుదలకు నెల రోజుల ముందే అక్కడ టికెట్ల అమ్మకం మొదలైపోయింది. ‘రాధేశ్యామ్’ విడుదలకు ఇంకో రెండు వారాలే ఉండటంతో దానికి కూడా ప్రి సేల్స్ మొదలైపోయాయి. ఈ మేరకు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా అప్పీల్ ఇస్తున్నాడు. యుఎస్‌లో మళ్లీ బాక్సాఫీస్ మంచి ఊపందుకోవడంతో ఈ చిత్రాలకు అడ్వాంటేజ్ అన్నట్లే. స్పైడర్ మ్యాన్, అన్‌చార్టర్డ్ సినిమాలకు వచ్చిన వసూళ్లు వాటికి ఉత్సాహాన్నిచ్చేవే.