తొలి భేటీలోనే గులాబీ బాస్ క్రెడిట్ పోగొట్టుకున్నారా?

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బోలెడన్ని అనుమానాలు.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన జరిపిన మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి తెలుగు మీడియా మొత్తం కేసీఆర్ అండ్ కో వినిపించిన వాదననే ప్రముఖంగా అచ్చేశాయి. ఆ మాటకు వస్తే.. మహారాష్ట్రకు తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధుల్ని రెండు రోజుల ముందు నుంచే పంపి.. గ్రౌండ్ స్టడీ చేయించి.. పర్యటన తర్వాత అక్కడి రాజకీయ వర్గాలు ఈ భేటీ మీద ఏమంటున్నాయి? ఎలా రియాక్టు అవుతున్నాయి? అక్కడి స్థానిక మీడియా సంస్థలు ఈ పర్యటనను ఎలా అభివర్ణిస్తున్నాయి? లాంటి వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు.

తన పర్యటన విజయవంతంగా ముగిసినట్లుగా సీఎం కేసీఆర్ వెల్లడించటమే కాదు.. తాను పాచిక వేస్తే పారకుండా ఉండదన్న విషయాన్ని గుర్తు చేసేలా ఆయన తీరును ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కాంగ్రెస్ కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోలేరు. సోమవారం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన మీద  టీపీసీసీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే.. శరద్ పవార్ ఇద్దరు జాతీయ రాజకీయాల గురించి .. మరి ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ తో అస్సలు చర్చ జరపలేదని పేర్కొనటం గమనార్హం.

దీనికి సాక్ష్యంగా స్థానిక మీడియాలో కవర్ అయిన అంశాల్ని ప్రస్తావించారు. అందులోనూ.. కేసీఆర్ పర్యటనలో ఫెడరల్ ఫ్రంట్ గురించిన ప్రస్తావన లేదు. ఇలాంటి వేళలో.. కొత్త సందేహాలు ముసురు కోవడం ఖాయం. గతంలోనూ మోడీ సర్కారుకు ప్రత్యామ్నాయంగా కూటమికి కట్టే ప్రయత్నంలో పశ్చిమ బెంగాల్ కు వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ కూటమి గురించి మాట్లాడితే.. కేసీఆర్ పర్యటన ముగిసిన రెండో రోజున మమత మాట్లాడుతూ.. గుడిని దర్శించటానికి కేసీఆర్ వచ్చారంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కేసీఆర్ గాలిని తీసేలా చేశాయి.
తాజాగా ఉద్ధవ్.. శరద్ పవార్ వ్యాఖ్యలు సైతం ఇదే రీతిలో ఉన్నాయన్నది మర్చిపోకూడదు.

అంతర్గతంగా ఏం మాట్లాడుకున్నారన్న విషయంపై బయటకు సమాచారం వచ్చింది లేదు కానీ.. తన మొదటి భేటీలోనే కేసీఆర్ నమ్మకం కోల్పోయేలా వ్యవహరించారన్న మాటను కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే.. జాతీయ రాజకీయాల గురించి.. ఫెడరల్ ఫ్రంట్ గురించి ఇప్పటికిప్పుడు మాట్లాడటానికి ఉద్ధవ్ ఠాక్రే.. శరద్ పవార్ లు సిద్ధంగా లేరు. యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత స్పందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ మాత్రం పొలిటికల్ టూర్ సక్సెస్ అయ్యిందంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన మీద ఉన్న విశ్వసనీయతను గండి కొట్టేలా ఉందన్నట్లుగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లుగా తన టూర్ సక్సెస్ అయ్యిందన్న అర్థంలో అటు ఉద్దవ్ నోటి నుంచి కానీ.. శరద్ పవార్ మాటల్లో కానీ వినిపించకపోవటంలో అర్థం ఏమిటి?