బుక్ మై షోతో గొడవ.. ప్రేక్షకులపై ప్రేమతో కాదా?

ఆంధ్రప్రదేశ్‌లో పది నెలల నుంచి సినిమా టికెట్ల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. అక్కడి ప్రభుత్వం గత ఏడాది ‘వకీల్ సాబ్’ రిలీజ్ టైంలో పాత జీవోను బయటికి తీసి టికెట్ల రేట్లు తగ్గించేయడంతో సినీ పరిశ్రమకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య తర్వాత మరింత పెద్దదై ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉంది. ఐతే ఏపీలో టికెట్ల ధరలు తగ్గిస్తే.. తెలంగాణలో మాత్రం ఉన్న రేట్లను పెంచి పరిశ్రమకు చేయూతనిచ్చింది ఇక్కడి ప్రభుత్వం. దీని పట్ల నిర్మాతలంతా హ్యాపీగానే ఉన్నారు.

ఇలాంటి టైంలో ఇప్పుడు అనుకోని వివాదం తలెత్తింది. మెజారిటీ టికెట్లు సేల్ అయ్యే ఆన్ లైన్ టికెటింగ్ సంస్థ ‘బుక్ మై షో’తో నిర్మాతలు కయ్యానికి దిగారు. టికెట్ల రేట్లు పెంచాక ఈ సంస్థ తీసుకుంటున్న కమిషన్ పర్సంటేజ్ ప్రకారం వారికి ఆదాయం పెరిగిందని.. దాన్ని తగ్గించాలన్నది  నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ అని వార్తలొచ్చాయి. సినిమా టికెట్ల అమ్మకం పూర్తిగా బుక్ మై షో చేతుల్లోకి వెళ్లిపోవడంతో తమ జుట్టును వాళ్ల చేతుల్లో పెట్టేసినట్లు అయిందని నిర్మాతలు గగ్గోలు పెట్టడం కూడా కనిపిస్తోంది.

ఐతే ఒక్కో టికెట్ మీద కమిషన్ పర్సంటేజ్ తగ్గించి ఆ మేరకు ప్రేక్షకులకు వెసులుబాటు కల్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ అసలు ఉద్దేశం అది కాదట. ఈ విషయంలో ప్రేక్షకుల మీద భారం పడకుండా చూడటం నిర్మాతల ఉద్దేశం కాదట. ప్రేక్షకుల నుంచి తీసుకునే కమిషన్లో తమకు వాటా కావాలని బుక్ మై షోను డిమాండ్ చేస్తున్నారని.. ఇందులో అసలు ఆడియన్స్ ప్రయోజనాలతో ఎంతమాత్రం సంబంధం లేదని అంటున్నారు.

టికట్ల రేట్లు పెంచాక ‘బుక్ మై షో’ వాళ్లు ఎక్కువ లాభ పడుతున్నారని.. ఇప్పుడు రేట్ల పెంపుతో పెరిగిన కమిషన్ మొత్తాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. ఇందుకు ‘బుక్ మై షో’ ఒప్పుకోకపోవడంతో ‘భీమ్లా నాయక్’ బుకింగ్స్‌ను దానికి ఇవ్వకుండా అడ్డు కట్ట వేశారని, ఇలా తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే మధ్యలో ప్రేక్షకులకు ఒరిగేది ఏముంది?