CBN: వివేకా త‌న‌య‌తో జ‌గ‌న్‌కు చెక్ పెడ‌తారా?

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్కు చెక్ పెట్టేందుకు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.  ఆ దిశ‌గా ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా సద్వినియోగం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడుతూనే.. మ‌రోవైపు పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీని బ‌లంగా బ‌రిలో దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్కు చెక్ పెట్టేలా బాబు సాగుతున్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది.

క‌డ‌ప‌లో పుంజుకునేందుకు
ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది. సీబీఐ ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత వేడెక్కింది. ఈ కేసు రాజ‌కీయాంగానూ మ‌లుపులు తిరుగుతోంది. ఇది చివ‌ర‌కు జ‌గ‌న్ మెడ‌కే చుట్టుకునేట‌ట్లు ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ హ‌త్య త‌ర్వాత సొంత జిల్లా ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క‌డ‌ప‌పై బాబు దృష్టి సారించారు. తాజాగా క‌డ‌ప జిల్లా టీడీపీ నేత‌ల‌తో బాబు స‌మావేశ‌మయ్యారు. అక్క‌డి నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేద‌ని మందలించిన‌ట్లు స‌మాచారం. నెల‌కు ఒక‌సారి స‌మావేశ‌మై స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని ఆయ‌న సూచించార‌ని టాక్‌.

సునీతను చేర్చుకుని..
అయితే క‌డ‌ప జిల్లాలో టీడీపీకి ప్ర‌స్తుతం బ‌ల‌మైన నేత‌లు లేర‌నే చెప్పాలి. ఉన్న నాయ‌కులంద‌రూ ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఆది నారాయ‌ణ రెడ్డి, సీఎం ర‌మేష్‌లు బీజేపీలోకి, రామ సుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో త‌న తండ్రి వివేకా హ‌త్య‌తో ర‌గిలిపోతున్న సునీత‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న తండ్రిని చంపిన వాళ్ల‌కు శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె పోరాటం చేస్తున్నారు.

ఈ హ‌త్య వెన‌క వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నార‌ని సీబీఐ అనుమానం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో జ‌గ‌న్ కుటుంబంతోనూ ఆమె పెద్ద‌గా క‌ల‌వ‌డం లేదు. దీంతో ఆమెను పార్టీలోకి చేర్చుకుని అక్క‌డ జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌నేది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. సునీత పార్టీలోకి వ‌స్తే ఆ ప్ర‌భావం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటుంద‌ని బాబు భావిస్తున్నారు. అందుకే ఆమెతో మాట్లాడేందుకు క‌డ‌ప జిల్లాకే చెందిన ఓ నేత‌ను పంపిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఈ విష‌యంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా అనుమానం వ్య‌క్తం చేశారు. మ‌రి సునీత టీడీపీలో చేరుతారో లేదో చూడాలి.