టీ కాంగ్రెస్ మార‌దు కాక మార‌దు..!

తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. పార్టీ నేత‌ల తీరు ఇప్ప‌ట్లో మారేలా క‌నిపించ‌డం లేదు. కొంద‌రు నేత‌ల తీరుతో ఒక‌వైపు అంతా బాగున్న‌ట్లు అనిపిస్తుండ‌గా.. మ‌రోవైపు మ‌రికొంద‌రు నేత‌ల ప్ర‌వ‌ర్త‌న‌ అస్స‌లు మింగుడుప‌డ‌డం లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అధ్య‌క్షుడు రేవంత్ పార్టీ బ‌లోపేతానికి ప్ర‌య‌త్నిస్తుంటే.. కొంద‌రు నేత‌ల చ‌ర్య‌ల‌తో ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతున్న‌ట్లు పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒకానొక ద‌శ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి దెబ్బ‌కు వ‌ల‌స‌ల‌తో విల‌విల‌లాడిన కాంగ్రెస్‌కు.. బీజేపీ దూకుడు కాస్త తోడ‌వ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గుర‌య్యాయి.

ఈ స్థితిలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణ‌యం మ‌ళ్లీ కాంగ్రెస్ కు జ‌వ‌స‌త్వాలు అందించింది. రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించడంతోనే పున‌ర్వైభ‌వం వ‌చ్చిన‌ట్లు అయింది. రేవంత్ కూడా అధిష్ఠానం న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా వ‌స్తున్నారు. అయితే.. అంతా బాగుంద‌నుకుంటున్న స‌మ‌యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు పార్టీని మ‌ళ్లీ మొద‌టికి తీసుకొచ్చాయి. పార్టీ శ్రేణులు మ‌ళ్లీ ఢీలా పడేలా చేశాయి. ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా రేవంత్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. అధిష్ఠానం నిర్దేశించిన బాధ్య‌త‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల పార్టీ స‌భ్య‌త్వాల‌ను 30 ల‌క్ష‌ల‌కు మించి పూర్తి చేయించ‌డ‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఇలా పార్టీ ప‌రిస్థితి అప్ అండ్ డౌన్ లా సాగుతోండ‌గా కోమ‌టి రెడ్డి వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌గామ‌, యాదాద్రి క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వంలో ఆయ‌న తీరు సంచ‌ల‌నం సృష్టించింది.  సీఎం కేసీఆర్ తో పాటు పాల్గొన‌డ‌మే కాకుండా కొబ్బ‌రి కాయ కూడా కొట్టారు. కేసీఆర్ ను ఆత్మీయంగా ఆళింగ‌నం చేసుకొని ప్ర‌సంగంలో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. దీంతో పార్టీలో క‌ల‌క‌లం రేగింది. రేవంత్ వెంట‌నే న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. కోమ‌టి రెడ్డి ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను బుజ్జ‌గించి పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇలా ప‌రిస్థితి మ‌ళ్లీ ఒక కొలిక్కి వ‌స్తుంద‌న‌గా.. అదే రోజు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం ఆందోళ‌న క‌లిగించింది. సంగారెడ్డి లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో జ‌గ్గారెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ స‌మావేశంలో కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు జ‌గ్గారెడ్డి. ఇటీవ‌లే కేటీఆర్ సంగారెడ్డి లో ఒక స‌మావేశంలో పాల్గొని మా పార్టీ నేత‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని జ‌గ్గారెడ్డికి చెప్ప‌గా.. ఇపుడు ఈ సంఘ‌ట‌నతో కాంగ్రెస్ లో క‌ల‌క‌లం రేగింది. ఇలాంటి నేత‌ల‌కు న‌చ్చ‌జెప్ప‌డంలోనే రేవంత్ స‌మ‌యం వృథా అవుతోంద‌ని.. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారోన‌నే ఆందోళ‌న పార్టీ నేత‌ల్లో నెల‌కొంది. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!