కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు కేసీఆర్‌: బండి ఆగ్ర‌హం

సర్జికల్ స్ట్రయిక్‌ జరగలేదని సీఎం కేసీఆర్‌ అనటం దారుణమని… తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రయిక్‌ జరిగినప్పుడు దేశమంతా సంబురాలు చేసుకున్నారని సంజయ్ చెప్పారు. రాహుల్‌గాంధీ, కేసీఆర్‌కు మాత్రమే సర్జికల్‌ స్ట్రయిక్‌ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. సైనికుల త్యాగాలను కేసీఆర్ కించపరిచారని సంజయ్ ఆరోపించారు. ఉగ్రవాదుల మాటలనే నమ్ముతారా? భారత సైనికులపైనా కేసీఆర్‌కు నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.

 కేసీఆర్ను క్షమించాల్సిన అవసరం లేదు..
 మూడేళ్ల క్రితం జరిగిన పుల్వామా ఘటనలో అనేక మంది జవాన్లు అమరులయ్యారని చెప్పిన సంజయ్‌ వారికి నివాళి అర్పించారు. పాక్‌ కుట్రకు దీటుగా భారత జవాన్లు సర్జికల్ స్ట్రయిక్‌ చేశారన్న సంజయ్‌.. పాక్‌ భూభాగంలోకి వెళ్లి మన జవాన్లు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. వీరోచిత పోరాటం చేసిన సైనికుల త్యాగాలను కేసీఆర్ తక్కువచేసి మాట్లాడారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ను క్షమించాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు దేశం మొత్తం బాధపడుతోందని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలను దేశం మొత్తం ఖండిస్తోందని సంజయ్ చెప్పారు.

క్లిన్ చిట్ ఇస్తారా?

రఫేల్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుపట్టారు. రఫేల్పై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లు సంజయ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్కు స్క్రిప్ట్ వస్తోందని విమర్శించారు. వారు చెప్పినట్లుగానే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు రేవంత్‌ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్‌ కేసీఆరేనని సంజయ్ ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ, ప్రధాని, ఇతర వ్యవస్థలపై.. కేసీఆర్కు నమ్మకం లేదని బండి సంజయ్ విమర్శించారు. దేశంలో నంబర్-1 అవినీతిపరుడు కేసీఆరేనని సంజయ్ ఆరోపించారు.

విద్యుత్ సంస్కరణల విషయంలో కేసీఆర్వి జూటా మాటలని సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. వాటిపైన దృష్టి మరల్చేందుకే విద్యుత్ సంస్కరణల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని సంజయ్ అన్నారు. 2020లో విద్యుత్ సంస్కరణల బిల్లులో కేంద్రం సవరణలు చేసిందని చెప్పారు. 2021లోనూ మరికొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి 3న విద్యుత్ సంస్కరణలపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చిందని సంజయ్ తెలిపారు. అందులో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు చెప్పారు.  

తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. దళిత బంధు కోసం రాజ్యాంగం మార్చాలా… అని ప్రశ్నించారు. దళిత బంధుకు.. రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అని బండి సంజయ్ నిలదీశారు. రామానుజ విగ్రహం వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. రామానుజచార్యులు సమానత్వం కోసం పాటుపడ్డారు. అది కేసీఆర్కు నచ్చదు. ఎందరో ప్రముఖులు వచ్చినా.. గతంలో వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వెళ్లలేదు. అని ప్ర‌శ్నించారు.