అక్క‌డ అమ్మ‌కం.. ఇక్క‌డ తాక‌ట్టు

రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కానీ కేంద్ర స‌ర్కారుకు కానీ పాల‌న వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టేందుకు అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్త‌డం స‌హ‌జ‌మే. ఆదాయం గురించి ప‌ట్టించుకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాల కోసం నిధులు కేటాయించ‌డం ఆ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఓట్ల కోసం నేత‌లు ఎంత‌కైనా వెన‌కాడ‌డం లేదు. హామీలు గుప్పిస్తూ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే ఉన్నారు.

అభివృద్ధి ప‌నులు ఆగినా.. పథ‌కాల‌ను మాత్రం ఆప‌డం లేదు. మ‌రోవైపు ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెడుతున్నాయి. దీంతో అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఆ అప్పులు ఒక ప‌రిధిలోపు ఉంటే మంచిదే. కానీ అది దాటితేనే ప్ర‌మాదం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. అప్పులు చేయ‌క‌పోతే పాల‌న సాగ‌ని ప‌రిస్థితి అక్క‌డ ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రుణాల కోసం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ఏపీ తాక‌ట్టు పెడుతోంది. ఇక తెలంగాణ అయితే ఏకంగా ఆదాయం కోసం ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మేస్తోంది.

ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలోని భూముల‌ను ఏపీ ప్రభుత్వం రుణాల కోసం తాక‌ట్టు పెట్టింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా విజ‌య‌వాడ‌లోని ఎంతో విలువైన బెర్మా పార్కును తాక‌ట్లు పెట్టి బ్యాంకు నుంచి అప్పు తెచ్చే ప్ర‌క్రియ ప్ర‌భుత్వం మొద‌లెట్టింది. ఇప్ప‌టికే ఇలా ఎన్నో ప్ర‌భుత్వ భూములు, ఆస్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం రుణాల కోసం త‌న‌ఖా పెట్టింది. జ‌గ‌న్ చివ‌రి సీఎం అనుకుంటున్నారేమో అందుకే అన్ని తాక‌ట్టు పెడుతున్నార‌ని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

ఇక తెలంగాణ‌లో ప్రభుత్వ భూముల‌ను వేలం వేసి ఆదాయం పొందే తంతుకు కేసీఆర్ ప్ర‌భుత్వం ఎప్పుడో తెర‌తీసింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో దాని చుట్టు ప‌క్క‌ల ఉన్న ప్ర‌భుత్వ భూముల్లో కొన్నింటిని అమ్మిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు జిల్లాల్లోని విలువైన ప్ర‌భుత్వ భూముల‌పై కూడా కేసీఆర్ క‌న్నేశార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాల్లో నివాస స్థలాల‌కు ద‌గ్గ‌ర్లో ఇళ్లు క‌ట్టుకోవాడానికి అనుకూలంగా ఉన్నా భూముల‌ను ప్లాట్లు వేసి విక్ర‌యించేందుకు ప్రభుత్వం సిద్ధ‌మవుతోంది. మ‌రోవైపు రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సాధ్యం కాని తెలంగాణ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల సంస్థ భూముల‌ను కూడా విక్ర‌యించాల‌ని యోచిస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.