తెలంగాణ నేత‌ల్లారా పుణ్యం క‌ట్టుకోండి… ష‌ర్మిల కీల‌క ప్ర‌క‌ట‌న‌

గ‌త కొద్దికాలంగా రాజ‌కీయంగా స్త‌బ్ధుగా ఉన్న వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయాల్లోని ప‌రిణామాల‌పై మ‌ళ్లీ స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని పొలిటిక‌ల్ హీట్ పై , ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పే మనిషి కాదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. దొర ఇచ్చిన మాట కోసం తల నరుక్కుంటాడు తప్పితే మాట తప్పే మనిషి కాదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే, అన్నీ కోర్టులే గుర్తు చేయాల‌ని కామెంట్ చేశారు.

ఏడు సంవ‌త్స‌రాల కింద సూసైడ్ చేసుకున్న 133 మంది రైతులకు ఇప్పటిదాకా ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ష‌ర్మిల‌ దుయ్యబట్టారు. రూ.6 లక్షలు ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైందని.. రైతు కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం అందలేదని మండిపడ్డారు.

Shrmila‘దొరకు కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ ఇచ్చిన జీవో గుర్తుకురాదు. కరోనా టెస్టులు పెంచాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో కమిషన్లను ఏర్పాటు చేయండని, ఆఖరికి చనిపోయిన రైతులను ఆదుకోవాలని కోర్టులే చెప్పాలి’ అని షర్మిల పేర్కొన్నారు. కోర్టులు చెబితేకానీ బాధ్యతలు గుర్తుకురాని ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని ఆమె విమర్శించారు.

తెలంగాణలో చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. తెలంగాణ ఇచ్చిన వారికైనా.. తెలంగాణ తెచ్చిన వారికైనా ఆ పుణ్యం దక్కాలంటే రాష్ట్రంలో చావులు లేకుండా చూడాలన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా, ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. సాధించిన తెలంగాణాలో చావులు లేకుండా చూడాలని ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని వారు.. తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల చావుల గురించి కొట్లాడే వారు ఎవరని మీడియాకు రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోట్ లో షర్మిలప్రశ్నించారు.