కాంగ్రెస్‌.. అద్దె కూడా క‌ట్ట‌లేక‌పోతుందా?

ఒక‌ప్పుడు దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన కాంగ్రెస్ ప‌రిస్థితి ఇప్పుడు దయ‌నీయంగా మారింది. కేంద్రంలో ఏకచ్ఛాత్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి పున‌ర్వైభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. కానీ స‌మ‌ర్థ‌మైన నాయ‌కత్వం లేక‌పోవ‌డంతో అది సాధ్యం కావ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో పంజాబ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్లో మాత్ర‌మే ఆ పార్టీ అధికారంలో ఉంది. త్వ‌ర‌లోనే పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అక్క‌డ ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదీ రాజ‌కీయాల్లో ఆ పార్టీ ప‌రిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా కాంగ్రెస్ అద్దె క‌ట్ట‌లేద‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధికారిక నివాసంతో పాటు మ‌రికొంత మంది నాయ‌కులు ఉంటున్న భ‌వ‌నాల అద్దె చెల్లించ‌లేద‌ని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ కార్యాల‌యానికి సంబంధించి గ‌త ప‌దేళ్ల అద్దె రూ.12,69,902 బ‌కాయి ఉంది. అక్బ‌ర్ రోడ్డులోని 26వ నంబ‌ర్ భ‌వ‌నంలో పార్టీ కార్యాల‌యం ఉంది.

2012 డిసెంబ‌ర్ త‌ర్వాత ఆ భ‌వ‌నం అద్దె చెల్లించ‌లేదు. ఆయా పార్టీలు సొంత భ‌వ‌నాలు నిర్మించుకునేందుకు మూడేళ్లు స‌మ‌యం ఇస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ భ‌వ‌నాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 2010 జూన్‌లోనే కాంగ్రెస్‌కు భూ కేటాయింపు జ‌రిగినా భ‌వ‌న నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా.. అనేక సార్లు గ‌డువు పొడిగించాల‌ని ప్రభుత్వాన్ని కోరుతూ వ‌స్తోంది.

మ‌రోవైపు జ‌న్‌ప‌థ్ రోడ్‌లోని 10వ నెంబ‌ర్ ఇంట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉంటున్నారు. 2020 సెప్టెంబ‌ర్ నుంచి ఆ భ‌వ‌నం రెంట్ కూడా క‌ట్ట‌లేదు. ఆ అద్దె బాకీ రూ.4,610 ఉంది. చాణ‌క్య‌పురిలోని ది‍‍-11/109 భ‌వ‌నంలో ఉండే సోనియా వ్యక్తిగ‌త కార్య‌ద‌ర్శి విన్సెంట్ జార్జ్ అద్దె బాకీ ఏకంగా రూ.5,07,911గా ఉంద‌ని కేంద్రం తెలిపింది. సుజిత్ ప‌టేల్ అనే సామాజిక కార్య‌క‌ర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌గా.. కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.