జగన్ తో చిరు ఏం మాట్లాడారంటే..

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు, ప్రముఖుల భేటీ తర్వాత ఈ వివాదానికి త్వరలోనే పుల్ స్టాప్ పడబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. జగన్‌తో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నాగార్జున, జూనియ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజ‌రుకాలేదు. ఈ భేటీ తర్వాత చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధ‌రల వివాదానికి శుభంకార్డు ప‌డినట్లే భావిస్తున్నామ‌ని చిరు మీడియాకు తెలిపారు. సీఎం జగన్ నిర్ణ‌యం అంద‌రినీ సంతోష‌ప‌ర్చింద‌ని, చిన్న సినిమాల‌కు ఐదో షోకు అనుమ‌తించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని చిరు అన్నారు.

చిన్న సినిమాల నిర్మాత‌ల‌కు మంచి వెసులుబాటు ఇచ్చార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జ‌రుగుతోంద‌ని చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సమావేశం తర్వాత మ‌హేశ్ బాబు కూడా మీడియాతో మాట్లాడారు. మొద‌ట‌గా చిరంజీవి గారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌ని మహేశ్ అన్నారు.

చిరు మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని కొనియాడారు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని, వారం..ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని మహేశ్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, చిరంజీవి సమావేశానికి వెళ్లారు కాబట్టి తాను వెళ్లలేదని అల్లు అరవింద్ చెప్పారు.