రాయ‌చోటి ర‌చ్చ‌.. వైసీపీ కీల‌క నేత‌కు సెగ‌!

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో కొత్త జిల్లా ఏర్పాటు అంశం సెగ‌లు పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న‌ వైఎస్సా ర్‌ కడపజిల్లాలోని కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌డ‌ప కేంద్రంగా వైఎస్సార్ జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు.  అదేవిధంగా  రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌తో రాయ‌చోటి కేంద్రంగా అన్న మయ్యజిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు.  వైఎస్సార్ జిల్లా విష‌యంలో ఎవ‌రికీ అభ్యంత‌రం లేక‌పోయినా.. రాయ‌చోటి కేంద్రంగా ఏర్పాటు  చేయ‌నున్న అన్న‌మయ్య జిల్లాపై మాత్రం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

తీవ్ర‌స్థాయిలో ర‌గ‌డ సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ‌మే.. రాయ‌చోటి వ‌ద్దు.. రాజంపేట ముద్దు నినాదంతో రంగంలోకి దిగింది. అంతేకాదు.. వైసీపీకి ఇక సెల‌వు.. అనే బ్యాన‌ర్లు రాయించి మ‌రీ పెట్టింది. రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజంపేట జిల్లా సాధ‌న స‌మితి పేరుతో అన్ని పార్టీల నేత‌ల నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటైంది. దీక్ష‌ల‌కు దిగారు. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవ‌ల క‌డ‌ప క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మర్పించారు. ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే!

రెండో వైపు చూస్తే.. రాయ‌చోటి వ‌ద్ద‌ని జ‌రుగుతున్న ఈ ఉద్య‌మాన్ని నిలువ‌రించాలా?  లేక‌.. చూస్తూ ఊరుకోవాలా? అనే స‌మ‌స్య‌.. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్న ప్ర‌భుత్వ చీఫ్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిన కుదిపేస్తోంది. రాయ‌చోటిని జిల్లా కేంద్రం చేయ‌డం ద్వారా ఇక్క‌డ అభివృద్ధి పుంజుకుం టుంది. పైగా.. ఇప్ప‌టి వ‌ర‌కు డెవ‌ల‌ప్ కాని.. ఈ ప్రాంతం ఇక‌పై.. డెవ‌ల‌ప్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో రాయ‌చోటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త‌, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించాల్సిన అగ‌త్యం ఆయ‌న‌పై ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు.. రాయ‌చోటిని స‌మ‌ర్ధించే ఒక‌వ‌ర్గం రాజంపేట‌కు అనుకూలంగా జ‌రుగుతున్న ఉద్య‌మాన్ని వ్య‌తిరేకిస్తూ.. రోడ్డెక్కింది.

దీనికి ఇప్పుడు ఎమ్మెల్యే గ‌డికోట మ‌ద్ద‌తివ్వాల‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు.కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో తాను జోక్యం చేసుకుని రోడ్డెక్కితే.. ప‌రిస్థితి మ‌రింత వేడెక్కుతుంద‌ని.. శ్రీకాంత్‌రెడ్డి భావిస్తున్నారు. పైగా తాను చీఫ్ విప్ పొజిష‌న్‌లో ఉండ‌డంతో రోడ్డెక్కితే బాగోద‌ని.. ప్ర‌భుత్వం తీసుకున్న‌నిర్ణ‌యానికి క‌చ్చితంగా క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని.. ఆయ‌న స‌ర్ది చెబుతున్నారు. కానీ, మ‌రోవైపు.. రాజంపేట ఉద్య‌మాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో గ‌డికోట క‌క్క‌లేక‌.. మింగ‌లేక ఇబ్బండి ప‌డుతున్నారు.

రాజంపేట‌ను కాదంటే.. పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఉన్న ఇమేజ్ పోయే ప‌రిస్థితి ఉంది. అలాగ‌ని.. వారికి మ‌ద్ద‌తు ప‌లికితే.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌న‌కు వ్య‌తిరేక‌త పెరిగిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాయ‌చోటి ర‌చ్చ‌.. ఈయ‌న‌కు సెగ బాగానే పెడుతోంద‌ని చెబుతున్నారు. మ‌రి చివ‌ర‌కు రాయ‌చోటినే క‌న్ఫ‌ర్మ్ చేసుకుంటారో.. లేక ఉద్య‌మ సెగ‌తో పోగొట్టుకుంటారో చూడాలి.