త్రివిక్ర‌మ్‌ను వ‌దిలేదే లే అంటున్న ప‌వ‌న్.. గుర్రుగా మ‌హేష్ ఫ్యాన్స్‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల మ‌ధ్య ఎంత మంచి స‌న్నిహిత్యం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడా స‌న్నిహిత్యం కార‌ణంగానే త్రివిక్ర‌మ్‌ను ప‌వ‌న్ వ‌దిలి పెట్ట‌డం లేదు. 2020లో విడుద‌లైన `అల వైకుంఠపురంలో` త‌ర్వాత త్రివిక్ర‌మ్ నుంచి మ‌రో సినిమా రాలేదు. అప్ప‌టి నుంచి ఈయ‌న ప‌వ‌న్ సినిమా కోసమే ప‌ని చేస్తున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `భీమ్లానాయ‌క్‌`. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాదు.. ద‌గ్గ‌రుండి మిగ‌తా ప‌నుల‌ను కూడా చూసుకుంటూ భీమ్లానాయ‌క్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు.

అయితే తాజాగా ప‌వ‌న్ త్రివిక్ర‌మ్‌కు మ‌రో సినిమా బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించార‌ట‌. సముద్రఖని తెరకెక్కించిన `వినోదయ సీతమ్` అనే తమిళ సినిమా ఇటీవ‌లె నేరుగా ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. దీంతో ప‌వ‌న్ త‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో వినోద‌య సీత‌మ్ తెలుగు రీమేక్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ప‌వ‌న్ సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ పై ఈ చిత్రం నిర్మితం కానుంది.

అయితే ఈ సినిమాలో త‌న‌ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసే బాధ్యతను ప‌వ‌న్ త్రివిక్రమ్ చేతిలోనే పెట్టాడ‌ని.. ఆయ‌న కూడా కాద‌న‌లేక ఓకే చెప్పాడ‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపై మ‌హేష్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే, త్రివిక్ర‌మ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌హేష్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. ఫిబ్ర‌వ‌రి 3న పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇలాంటి త‌రుణంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమా బాధ్య‌త‌ల‌ను తీసుకుని.. మ‌హేష్‌ చిత్రాన్ని ఎక్క‌డ నిర్ల‌క్ష్యం చేస్తాడో అని ఫ్యాన్స్ ఖంగారు ప‌డుతున్నారు.