క్రికెట్ హీరోల కోసం ల‌తాజీ చేసిన గొప్ప ప‌ని

అండ‌ర్-19 ప్ర‌పంచ‌కప్ గెలిచిన కుర్రాళ్ల‌కు బీసీసీఐ తాజాగా ఒక్కొక్క‌రికి రూ.40 ల‌క్ష‌ల చొప్పున న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీనేజీలో ఉన్న కుర్రాళ్ల‌కే ఇంతింత న‌జ‌రానాలంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. త‌మ రాష్ట్రాల‌కు చెందిన కుర్రాళ్ల‌కు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వేర్వేరుగా క్యాష్ ప్రైజ్‌లు ఇస్తున్నాయి. ఇక వీరికి ఐపీఎల్ వేలంలోనూ భారీగానే రేటు ప‌లికే అవ‌కాశ‌ముంది. ఇప్పుడు క్రికెట్లో పేరు సంపాదిస్తే ఇలా క‌న‌క వ‌ర్షం కురుస్తుంది.

కానీ నాలుగు ద‌శాబ్దాల కింద‌ట ఈ ప‌రిస్థితి లేదు. 1983లో భీక‌ర వెస్టిండీస్‌ను గెలిచి ఇండియాకు వ‌స్తే సన్మాన కార్య‌క్ర‌మం చేయ‌డానికి కూడా బీసీసీఐ ద‌గ్గ‌ర స‌రిప‌డా డ‌బ్బులు లేవు. అంత పెద్ద విజ‌యం సాధిస్తే ఇక న‌జ‌రానాల గురించి ఏం చెప్పాలి. ఆ స్థితిలో వారికి లెజెండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ చేసిన సాయం మ‌రువ‌రానిది.

క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డే ల‌తా.. అప్ప‌టి ప్ర‌పంచ‌క‌ప్ హీరోలకు సాయం చేయ‌డానికి న‌డుం బిగించింది. బీసీసీఐ విజ్ఞ‌ప్తి మేర‌కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో.. ఆమె భారీ సంగీత విభావ‌రి నిర్వ‌హించింది. ఈ క‌న్స‌ర్ట్ ద్వారా బీసీసీఐ అనుకున్న‌దానికంటే ఎక్కువ నిధులే వ‌చ్చాయి. త‌ర్వాత అదే స్టేడియంలో ల‌త స‌మ‌క్షంలో క‌పిల్ డెవిల్స్‌కు స‌న్మానం జ‌రిగింది. జ‌ట్టులో స‌భ్యుల్లో ఒక్కొక్క‌రికి రూ.ల‌క్ష చొప్పున బీసీసీఐ న‌జ‌రానాలు అందించింది. ఆ రోజుల్లో అదే పెద్ద మొత్తం.

ఆ త‌ర్వాత భార‌త క్రికెట్ ఇంతింతై అన్న‌ట్లుగా ఎలా ఎదిగిందో.. ఇప్పుడు క్రికెట‌ర్లు ఏ స్థాయిలో ఉన్నారో.. వారికి ఎంతెంత న‌జ‌రానాలు అందుతున్నాయో తెలిసిందే. ఇక ల‌తాకు భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ అంటే అమిత‌మైన ఇష్టం. అత‌డిని ఆమె కొడుకులా చూసేది. అత‌ను ఆమెను అమ్మ అనేవాడు. 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో సెమీస్ సంద‌ర్భంగా భార‌త్ గెలుపు కోసం ల‌త రోజంతా ఉప‌వాసం ఉండ‌టం విశేషం.