అస‌దుద్దీన్‌కు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌.. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించింది. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై కొంద‌రు దుండ‌గులు కాల్పులు జరిపిన విష‌యం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్ప్లాజా వద్ద జరిగిన  దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని అస‌దుద్దీన్ కోరారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిసింది.

నిందితులను సచిన్, శుభంగా గుర్తించారు. ఒవైసీ హిందూ- వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు.. తమ మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల వద్ద పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. “యూపీ మేరఠ్లోని కిథౌర్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ బయలుదేరాను. ఛాజర్సీ టోల్గేట్ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు.” అని అసదుద్దీన్ చెప్పారు.