మోడీ వెనకుడుగు చూసిన తర్వాత.. ఈ మాటలేంది సజ్జల?

పీఆర్సీ ఎపిసోడ్ లో ఇప్పటికే ఏపీ సర్కారుకు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేమీ ఫలించక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు లక్షలాదిగా విజయవాడకు చేరుకోవటం.. నిరసన ర్యాలీ సందర్భంగా లక్షల మంది ఒక చోటుకు చేరుకోవటానికి మించిన డ్యామేజీ మరేం ఉంటుంది? ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆచితూచి మాట్లాడం మానేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం వల్ల రచ్చ మరింత పెద్దది అవుతుందే తగ్గించి తగ్గే పరిస్థితి ఉండదు.

సాక్షి దిన పత్రికలో కీలక భూమిక పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన ర్యాలీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది పెడుతున్న సమయంలో సజ్జల మాట్లాడిన మాటలు మరింత మంట పుట్టేలా ఉన్నాయి. అంతే కాదు.. సమస్య మరింత ముదిరేలా చేస్తున్నాయంటున్నారు. సమ్మె చేస్తే  ఇబ్బంది రాకుండా చూసే బాద్యత ప్రభుత్వానిదని.. సమ్మెకు వెళ్తే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఖాయమని స్పష్టం చేశారు.అంతేకాదు.. మరిన్ని కండీషన్లను తెర మీదకు తీసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఉద్యగులు మరింత రగిలిపోయేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. సీఎంతో కాకుండా ముందు మంత్రుల కమిటీతో చర్చలు జరపాలన్న మాట సజ్జల నోటి నుంచి రావటం చూస్తే.. ఈ తరహా మొండితనం మూర్ఖత్వంగా మారి.. మొదటికే మోసం వస్తుందన్న చిన్న విషయాన్ని సజ్జల అండ్ టీం అర్థం చేసుకొని ఉంటే.. విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సజ్జల నోటి నుంచి వచ్చిన మాటల కారణంగా జగన్ ప్రభుత్వంపై మరింత కోపం కలిగేలా చేస్తున్నాయని చెప్పాలి.

జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో పడిన తర్వాత జీవోలు రద్దు అనడం అన్నది అర్థం లేని డిమాండ్ గా సజ్జల అభివర్ణించడం గమనార్హం. సజ్జల మాటలో నిజమే ఉందనుకుందాం. కేంద్రంలోని మోడీ సర్కారు వివరంగా చెప్పి.. రాచ మార్గంలో చట్టాలు చేసేయటం తెలిపిందే. అలాంటిది చట్టాలు చేసిన కొంతకాలానికి అన్ని తూచ్ అంటూ ఇటీవల తాము చేసిన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే.. మొత్తంగా చూసినప్పుడు మోడీ అంతటి బలమైన అధినేతనే.. తాను తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవటం.. అందుకు సంబంధించిన వివరాల్ని సేకరించటం ద్వారా.. వీలైనంత తక్కువ డ్యామేజ్ తో బయటకు రావటం తెలిసిందే. ఇదంతా చూసిన తర్వాత కూడా.. ఖాతాల్లోకి జీతాలు పడ్డాక.. దాని గురించి మాట్లాడకూడదన్న విషయాన్ని ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల నోట రావటమా? ఇలాంటి తప్పులు ఆయన ఎందుకు చేస్తున్నట్లు? అన్న సందేహం కలుగక మానదు. అయినా జీతాలు వేయకముందు నుంచే వారీ డిమాండ్ చేస్తున్నారన్న విషయం సజ్జల ఎందుకు మరిచిపోతున్నారు.