మెగా మూవీ సెట్‌లో నయనతార

Nayanatara

నయనతార చేసే సినిమాల లిస్టును పరిశీలిస్తే.. ఆమె వాటిని సెలెక్ట్ చేసుకుంది అనేకంటే ఆ పాత్రలు, సినిమాలే ఆమెను ఏరి కోరి వరించాయి అనడం కరెక్టనిపిస్తుంది. కొందరు ఆమెనే దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుతున్నారు. కొందరు కథ అల్లగానే ఈ పాత్ర ఆమే చేయాలి అని ఫిక్సైపోతున్నారు. గాడ్‌ఫాదర్ విషయంలో ఈ రెండోదే జరిగింది.       

మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్‌‌’ని తెలుగులో రీమేక్ చేయాలనే నిర్ణయం తీసుకోగానే మంజు వారియర్ పాత్రకి ఎవరిని తీసుకోవాలి అనే డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే హీరోకి చెల్లెలే అయినా ఎంతో హుందాగా ఉండే ఆ రోల్ సినిమాకి అత్యంత కీలకం. అందుకే ఎవరైతే బాగుంటారా అని అందరూ మల్లగుల్లాలు పడ్డారు. శోభన, రమ్యకృష్ణ లాంటి సీనియర్ హీరోయిన్ల నుంచి కొత్త నటీమణుల వరకు చాలామంది పేర్లు పరిశీలించారు.       

అయితే చిరంజీవి మాత్రం మొదట్నుంచీ నయనతార అయితేనే ఆ పాత్రకి బాగుంటుందని ఫీలయ్యారట. అయితే చెల్లెలి క్యారెక్టర్ కనుక నయన్ నో అంటుందేమోననే అనుమానం అందరిలోనూ ఉంది. కానీ అలా జరగలేదు. పాత్ర ప్రాధాన్యత తప్ప మరేవీ పట్టించుకోని నయన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు షూట్‌లో కూడా జాయినైంది.       

గాడ్‌ఫాదర్ సెట్‌లో జాయినవ్వడానికి రీసెంట్‌గా సిటీకి వచ్చింది నయనతార. కరోనా వల్ల ఆగిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. అయితే కోవిడ్ బారిన పడటంతో చిరంజీవి లేకుండానే టీమ్ అంతా వర్క్ చేస్తున్నారు. అందుకే నయన్‌ కూడా వచ్చి జాయినైంది. షూట్ కంప్లీట్ చేసుకుని హోటల్‌కి వెళ్తూ అందరి కంటా పడింది. పది రోజుల్లో తన పార్ట్ కంప్లీట్ చేసి షారుఖ్, అట్లీల సినిమా కోసం ముంబై వెళ్లనుందట నయన్.