#SSMB28: ఎన్నాళ్లో వేచిన సినిమా ఎట్టకేలకు…

మహేష్ బాబు-త్రివిక్రమ్‌లది టాలీవుడ్లో క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ కల్ట్ క్లాసిక్‌గా నిలబడిపోయింది. తెలుగు సినిమా చరిత్రల్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటారు. దీని తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. అది కూడా టీవీల్లో, ఓటీటీల్లో గొప్పగా ఆదరణ తెచ్చుకుంది.

ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతుంటారు. ఐతే మహేష్, త్రివిక్రమ్‌ల కలయికలో మరో సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ.. వీరి కాంబినేషన్ సాధ్య పడలేదు. గత ఏడాది వీరు మళ్లీ కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. కానీ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.

ఇందుకు అనేక కారణాలున్నాయి. ఐతే ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీ శ్రీకారం చుట్టుకుంది.గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఐతే మహేష్ బాబు లేకుండానే ఈ వేడుక పూర్తయింది. కరోనా నుంచి ఇటీవలే కోలుకుని విశ్రాంతి తీసుకుంటుండటం, అలాగే సోదరుడు రమేష్ బాబు మరణంతో బాధలో ఉండటంతో మహేష్ ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో మహేష్ భార్య నమ్రత ఈ వేడుకకు హాజరైంది.

అలాగే కథానాయిక పూజా హెగ్డే కూడా ముహూర్త కార్యక్రమంలో పాల్గొంది. దర్శకుడు త్రివిక్రమ్.. నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరుల సమక్షంలో పూజా కార్యక్రమం పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి నెల రోజుల దాకా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ పని పూర్తి చేసి.. వేసవిలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌కు హాజరయ్యే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తున్న తమనే ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు.