బీజేపీ నేత‌లు కేసీఆర్ చేతిలో అడ్డంగా బుక్క‌య్యారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ్యంగంపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. రాజ్యాంగాన్ని మార్చాల‌న్న కామెంట్లు తెలంగాణ‌లో కొత్త చ‌ర్చ‌కు, ఇంకా చెప్పాలంటే ర‌చ్చ‌కు కేంద్రంగా మారాయి. ఈ విష‌యంలో అంతా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌ధానంగా బీజేపీ ఇందులో ముందు వ‌రుస‌లో ఉంది. కేసీఆర్ గురించి కామెంట్లు చేస్తోంది. అయితే, తాజాగా కేసీఆర్ న‌మ్మిన‌బంటు అనే పేరున్న మాజీ ఎంపీ , రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాజ్యాంగంపై చర్చ కొత్తేమి కాదని, ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగం పని తీరుపై సమీక్షకు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజపేయి 2000 సంవత్సరంలో న్యాయ నిపుణులతో కమిషన్ వేశారని గుర్తు చేసిన  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు.

రాజ్యాంగం పై చర్చ అనే అంశం కొత్తేమి కాదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న చర్చ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జస్టిస్ రాజమన్నార్ కమిషన్ వేశారని అన్నారు. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి రాజ్యాంగం పని తీరుపై జస్టిస్ వెంకటా చలయ్యా నేతృత్వంలో న్యాయ నిపుణులు సోలీ సొరబ్జి, పరాశరన్, సర్కారియా, జీవన్ రెడ్డి, పున్నయ్య, సుభాష్ కశ్యప్ వంటి వారితో కమిషన్ వేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

2002 లో జస్టిస్ వెంకటా చలయ్యా కమిషన్ అప్పటి ప్రధాని వాజపేయి కి నివేదిక సమర్పించిందని, బీజేపీ నాయకుల దురదృష్టమో, దేశ ప్రజల అదృష్టమో కానీ బీజేపీ పరాజయంతో ఆ నివేదిక అటక ఎక్కిందని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలి అని మాత్రమే చెప్పారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, నదీజలాల సమస్యలను పరిష్కరించకపోవడం, జీఎస్టీ, వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఆ అంశాన్ని ప్రస్తావించారని ఆయన తెలిపారు. మ‌రి చ‌రిత్ర విశ్లేషించిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో మ‌రి.