తేదేపా తప్పు….వైకాపా ఎత్తు

YS-Jagan-Chandrababu-Naidu

ఆంధ్రలో ఏం జరుగుతోంది? వైకాపా ఎందుకు దూకుడుగా వెళ్తోంది. ముఖ్యమంత్రి జగన్ కక్ష రాజకీయాలు చేస్తున్నారు? మరేదైనా ఆలోచన వుందా? అసలు ఇందులో తేదేపా తప్పు ఏ మేరకు? ఇలా చాలా ప్రశ్నలు వున్నాయి. వీటికి సమాధానం తెలుసుకోవాలి అంటే కొంచెం వెనక్కు వెళ్లాలి.

తేదేపా తప్పిదాలో? వైకాపా జనాకర్షక వరాలో? మొత్తం మీద ఎన్నికల్లో చంద్రబాబు వర్గాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, జగన్ వర్గాన్ని జనం నెత్తిన పెట్టుకున్నారు. నిజానికి ఇలాంటి దారుణ పరాజయం తరువాత తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఆత్మశోధన. పార్టీ పటిష్టత. వగైరా..వగైరా…

కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది. మూడు నెలలు మౌనంగా వుంది. వైకాపా వచ్చి వంద రోజులు కాకుండానే యాగీ మొదలు పెట్టింది. ప్రతి చిన్నదానికీ, అయిన దానికీ కాని దానికీ కోర్టు మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. తను నేరుగానో, తనకు కావాల్సిన వారితోనో ఇలా చేయడం స్టార్ట్ చేసింది. సరే, వైకాపా నిర్ణయాలకు ప్రతి దానికీ అడ్డం పడడం మొదలైంది.

మరోపక్క తేదేపా అనుకూల మీడియా నిత్యం వైకాపాను ఎండ గట్టడమే పనిగా పెట్టుకుంది. ఇది చూసి, పేపర్లో పేరు కోసం అన్నట్లుగా చాలా మంది నోరు చేసుకోవడం ప్రారంభించారు. ఇదంతా ఫ్రీ గా కష్టపడకుండా వస్తోంది. దాంతో ఇదేదో బాగుందని చంద్రబాబు కూడా ఇక పార్టీ వ్యవహారాలు అటక ఎక్కించి, ఈ తరహా ఫ్రీ హడావుడికి అంకితం అయిపోయారు.

ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. ఉన్నమాట చెప్పాలంటే జగన్ ప్రభుత్వం కంపారిటివ్ గా మిగిలిన చాలా రాష్ట్రాలతో పోల్చితే, కరోనాను బాగానే డీల్ చేసింది. ఇలాంటి టైమ్ లో బాబు అండ్ కో సైలంట్ గా వుండాల్సింది. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన ఏడాది అయిన సందర్భంగా దారుణంగా రెచ్చిపోయారు. ఇసుక, మద్యం, ఇలా చాలా చాలా వాటి మీద గట్టిగా దండెత్తారు.

నిజానికి తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంకా ఎన్నికలు అనేవి నాలుగేళ్ల దూరంలో వున్నాయి. కేంద్రం మద్దుతు కానీ స్నేహం కానీ తేదేపాకు లేవు. టెంపరరీగా పరిష్కారం అయిపోయే ఇసుక లాంటి సమస్యలను పట్టుకుని అంత యాగీ చేయడం వల్ల లాంగ్ రన్ లో ఉపయోగం లేదు. లిక్కర్ గురించి తేదేపా గోల చేయనక్కరలేదు. జనమే తెలుసుకుంటారు. ఇలా కొన్నాళ్లు మౌనంగా వుండి వైకాపాను తప్పుల మీద తప్పుల చేసుకునేలా చేయాల్సింది. కానీ తేదేపా అలా చేయలేదు. ప్రతి చిన్న దానికీ యాగీ చేస్తోంది. జగన్ దాన్ని వెంటనే సర్దేసుకుంటున్నారు.

ఇలా ఎన్నాళ్లని? అందుకే జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. అచ్చెంనాయుడు కు వచ్చిన సమస్య ఏమీ లేదు. రేపు కాకుంటే ఎల్లుండి బెయిల్ మీద బయటకు వస్తారు. ఆ తరువాత ఆ కేసు అలా నడుస్తూ వుంటుంది. జేసి బ్రదర్ కూడా ఈ వారం కాకుంటే వచ్చేవారం బెయిల్ మీద వస్తారు. ఆ కేసు కూడా అలా నడుస్తూ వుంటుంది. కానీ బెయిల్ వచ్చిన వెంటనే కాస్త హుంకరింపులు వినిపిస్తాయి తప్ప, ఆ తరువాత కాదు. ఇక ఈ నాయకులకు మౌనమే భాష అవుతుంది. ఎందుకంటే జరిగిన వాటిల్లో వాళ్ల తప్పులు ఎంతో కొంత వున్నాయని వాళ్లకు తెలుసు. తప్పు చేయని రాజకీయ నాయకుడు ఎవరు వుంటారు కనుక? అందువల్ల ఇక కాస్త మాటల తూటాలు తగ్గిస్తారు.

ఇప్పటికే సోషల్ మీడియా అరెస్టుల తరువాత ఆ తరహా జనాలు సైలంట్ అయ్యారు చాలా వరకు. అలాగే అచ్చెంనాయుడు, జేసి బ్రదర్ అరెస్టుల తరువాత చాలా పేర్లు వినిపించడం ప్రారంభమైంది. దేవినేని, యనమల ఇలా చాలా పేర్లు. ఇవన్నీ గ్యాసిప్ లే కావచ్చు. కానీ కొంత ప్రభావం అయితే వుంటుంది. కొన్నాళ్ల పాటు తేదేపా అనుకూల మీడియాలో కాస్త గట్టిగా నోరు పారేసుకునే జనాల నోళ్లు కొంత వరకు మూత పడతాయి. ఈ సందట్లో జగన్ తను అనుకున్న పనులు తాను చేసుకుంటూ పోతారు

అయితే ఇక్కడ బాబు తప్పేంటీ? ప్రతిపక్షంగా ఆయన పని ఆయన చేయడం తప్పా? అని ప్రశ్నించడం సులువే. కానీ అస్త్రాలు అనేవి మెల్లగా ఒక్కొక్కటి వాడుకోవాలి. ఆవేశపడిపోయి అన్నీ ఒకేసారి విసిరేయడం కాదు. ఇంకా చేయాల్సి న ప్రయాణం నాలుగేళ్లు వుంది. అన్నాళ్ల పాటు పార్టీ జనాలను కాపాడుకోవాలి. వాళ్ల ధైర్యాన్ని కాపాడుకోవాలి. ఇలా చేయాలంటే పార్టీ నిర్మాణం మీద, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టాలి. అది మానేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.

ఇక లాభంలేదని జగన్ ఈ కొత్త మాస్టర్ ప్లాన్ కు తెరతీసారు. ఇప్పుడేమయింది. హైదరాబాద్ లో కేసు పడగానే బాబు జారిపోయి, హైదరాబాద్ వచ్చేసినట్లు, తేదేపా నాయకులు ఇక ఎక్కడి వారు అక్కడ సైలంట్ అవుతారు. జరగబోయేది అదే. ఇది రేపటి బడ్జెట్ సమావేశాల్లోనే స్పష్టం అవుతుంది.