అంటే భీమ్లా నాయ‌క్ రాన‌ట్లేనా?

దేశంలో కొవిడ్ కేసులు ఎంత‌గా పెరుగుతున్న‌ప్ప‌టికీ.. మ‌నుషుల‌పై వైర‌స్ చూపిస్తున్న ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉండ‌టంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కొవిడ్ ఫ‌స్ట్, సెకండ్ వేవ్ మాదిరి వ్యాపారాల‌పై మూడో వేవ్ మ‌రీ ఎక్కువ ప్ర‌తికూల ప్ర‌భావం ఏమీ చూప‌ట్లేదు. థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు తాత్కాలిక‌మే అని.. ఇంకో నెల రోజుల‌కు వెండితెర‌లు మామూలుగానే న‌డుస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 25కు షెడ్యూల్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ య‌ధావిధిగా రిలీజ‌వుతుంద‌నే ఆశ‌తో ఉన్నారు అభిమానులు. నిర్మాత‌లు కూడా వాయిదా ప్ర‌క‌ట‌న‌లేమీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అంద‌రిలోనూ ఆశ‌లున్నాయి. కానీ ఈ రోజు జ‌రిగిన ప‌రిణామం భీమ్లా నాయ‌క్ రిలీజ్‌పై సందేహాలు రేకెత్తించింది. కొత్త‌గా ప్ర‌క‌టించిన‌ శ‌ర్వానంద్ సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు రిలీజ్ డేటే ఈ సందేహాల‌కు కార‌ణం.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాను ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేస్తున్న‌ట్లుగా పేర్కొంటూ కొత్త పోస్ట‌ర్ వ‌దిలింది చిత్ర బృందం. భీమ్లా నాయ‌క్ ఆ డేట్‌కు షెడ్యూల్ అయింద‌ని తెలిసీ ఇలా పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే. గుడ్డిగా అయితే ఇలా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి ఉండ‌రు. క‌చ్చితంగా భీమ్లా నాయ‌క్ వాయిదా అన్న స‌మాచారం ఉండే ఉంటుంది.

లేదా ఆ సినిమా వాయిదా ప‌డుతుంద‌న్న అంచ‌నాతో వీళ్లు డేట్ ఇచ్చారేమో. ఏదైతేనేం.. భీమ్లా నాయ‌క్ నిర్మాత‌ల నుంచి ఈ ప్ర‌క‌ట‌న లేకుండానే శ‌ర్వా మూవీకి ఇలా డేట్ ప్ర‌క‌టించ‌డం ప‌వ‌న్ అభిమానుల‌కు న‌చ్చ‌ట్లేదు. మ‌రి సితార ఎంట‌ర్టైన్మెంట్స్ వారి ఆలోచ‌న ఎలా ఉందో ఏమో చూడాలి మ‌రి. ప్ర‌స్తుతానికి భీమ్లా నాయ‌క్ ప‌నులేమీ చురుగ్గా జ‌ర‌గ‌ట్లేద‌ని తెలుస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లుగా స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌పై ఒక స్ప‌ష్ట‌త ఇస్తే బాగుంటుందేమో.