మహేష్ కాకుంటే.. రాముడు అతనే..


భారతీయ హిందువులకు అత్యంత ఇష్టమైన పురాణ గాథలు మహాభారతం, రామాయణం మీద ఇప్పటికే వివిధ భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. సీరియళ్లు కూడా తీశారు. కానీ గత కొన్నేళ్లలో టెక్నాలజీ విస్తృతి పెరిగి తెరపై అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో ఈ గాథల్ని మరింత గొప్పగా  తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో ఫిలిం మేకర్స్ ఉన్నారు. మహాభారతంపై రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాజమౌళి చేయాలనుకున్న మెగా ప్రాజెక్టు కూడా ఒకటి.

కాకపోతే అది పట్టాలెక్కడానికి టైం పట్టొచ్చు. ఇంకోవైపు రామాయణం మీద ఒక మెగా మూవీ గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. తెలుగువాడైన బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో కలిసి ఈ ప్రాజెక్టు అనౌన్స్  చేసి కొన్నేళ్లవుతోంది. దంగల్ దర్శకుడు నితీశ్ తివారి ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.కొన్నేళ్ల నుంచి స్క్రిప్టు తయారీ, ప్రి ప్రొడక్షన్ పనుల్లోనే మునిగి ఉన్న చిత్ర బృందం.. నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేయలేదు. ఐతే ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా పని అవగొట్టేయాలని చూస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ చిత్రంలో రాముడిగా చూపించాలన్నది మేకర్స్ కోరిక. రాముడి పాత్రకు మహేష్ పర్ఫెక్ట్‌గా సూటవుతాడని భావిస్తున్నారు. మహేష్ వల్ల సౌత్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని.. మిగతా కీలక పాత్రలకు బాలీవుడ్ ఆర్టిస్టులను పెట్టి పాన్ ఇండియా లెవెల్లో దీనికి క్రేజ్ తీసుకురావాలని అనుకున్నారు. కానీ మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. వేరే కమిట్మెంట్లకు తోడు.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయమే అందుక్కారణం.

అందులోనూ రాజమౌళి సినిమా లైన్లో ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బంది రానివ్వకూడదన్నది అతడి ఉద్దేశం. ఈ నేపథ్యంలో ‘రామాయణం’పై మహేష్ విముఖతతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మధు మంతెన, అరవింద్ మహేష్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఐతే మహేష్ నిక్కచ్చిగా ఈ సినిమా చేయనని చెప్పేస్తే.. సెకండ్ ఆప్షన్‌గా రణబీర్ కపూర్‌ను పెట్టుకున్నారు. అతడికి కూడా కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. బ్రహ్మాస్త్ర, అనిమల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతణ్ని ఈ సినిమాకు ఒప్పిస్తే.. రావణుడిగా దక్షిణాది నుంచి పేరున్న నటుడిని పెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.