వణికించేస్తున్న ఎంఐఎం

ఒక్క సీటులో కూడా గెలుస్తుందో లేదో తెలీని ఎంఐఎం పెద్ద పార్టీలను కూడా వణికించేస్తోంది. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఇదంతా. ఎంఐఎం 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మొదటి జాబితాలో 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మిగిలిన పార్టీ అధినేతలు గెలుపు కోసం టెన్షన్ పడుతుంటే ఓవైసీ మాత్రం వినోదం చూస్తున్నారు.

యూపీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల ఓట్లు కూడా అత్యంత కీలకమనే చెప్పాలి. ప్రతి ఎన్నికలోను ముస్లిం ఓట్లు కీలకమే అయినా రాబోయే ఎన్నికల్లో అధికారం నిలుపుకోవటం బీజేపీకి అత్యంత ప్రతిష్ట గా మారింది. ఇదే సమయంలో అధికారాన్ని అందుకోవటం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. దాంతో ఈ రెండు పార్టీలు ఏ సామాజిక వర్గం ఓట్లను కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. సరిగ్గా ఇక్కడే ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది.

యూపీలోని 12 జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు. సుమారు 143 నియోజకవర్గాల్లో ముస్లింలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటిల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిక్టేట్ చేసేంత ఓట్లున్నాయి. అందుకనే  అఖిలేష్ ముస్లిం ఓటు బ్యాంకుపై కన్నేశారు. అఖిలేష్ ముస్లిం-యాదవ-ఓబీసీ-జాట్ కాంబినేషన్తో ఎన్నికలకు వెళుతున్నారు. బీజేపీ కూడా బ్రాహ్మణ-ఓబీసీ-ముస్లిం-ఎస్సీ నినాదంతో ఎన్నికలకు వెళుతోంది. అయితే ఒవైసీని దింపింది బీజేపీయే అనే విమర్శ బలంగా ప్రచారంలో ఉంది.

ఇక్కడ ప్రధాన పార్టీలకు సమస్య ఏమొచ్చిందంటే ముస్లిం జనాభా ఎక్కడ ఎక్కువుందో చూసి మరీ ఎంఐఎం అభ్యర్ధులను పోటీకి పెడుతోంది. 100 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేయబోతోంది. ఈ వంద నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గెలవకపోయినా ప్రత్యర్ధులను ఓడగొట్టగలదు. ఎలాగంటే పోయిన ఎన్నికల్లో 30 చోట్ల పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. కానీ కొన్నింటిలో బీఎస్పీ, మరికొన్నింటిలో ఎస్పీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది. మరి దీని ప్రభావం తమపై ఎక్కడ పడుతుందో అని ఎస్పీ తదితర పార్టీ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోందట.