హిందీ ‘పుష్ప’.. నిర్మాతలకు దక్కిందేమీ లేదా?

‘పుష్ప’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడటంలో ఆశ్చర్యం లేదు. కేరళలో మంచి వసూళ్లు రాబట్టడం కూడా విడ్డూరమేమీ కాదు. ఇక్కడా అక్కడా అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ జనాలు ఈ సినిమాతో కనెక్ట్ కావడం గురించి కూడా మరీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ కథ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు రూ.పాతిక కోట్లు. కాబట్టి ఇది మరీ పెద్ద ఫిగరేమీ కాదు. కానీ హిందీలో ఈ చిత్రం రూ.85 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం మాత్రం కచ్చితంగా సెన్సేషనే.

హిందీ వెర్షన్ హక్కులు అమ్మింది రూ.10 కోట్లకే. మామూలుగా బన్నీ ప్రతి సినిమా డబ్బింగ్ హక్కులూ రూ.10 కోట్లకు పైగానే అమ్ముడవుతున్నాయి. అతడి చిత్రాలను యూట్యూబ్‌లో డబ్ చేసి రిలీజ్ చేసినా ఈ మేరకు ఆదాయం వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లకు థియేట్రికల్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేసింది గోల్డ్ మైన్స్ సంస్థ. ఐతే వాళ్లు కానీ, ఇటు పుష్ప నిర్మాతలు కానీ ఊహించని స్థాయిలో ఈ చిత్రానికి వసూళ్లు వచ్చాయి.

ఐతే ఇంత తక్కువకు హక్కులు కట్టబెట్టేశామే అని ‘పుష్ప’ నిర్మాతలు ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి రూ.20 కోట్ల మార్కును దాటాక వచ్చే ఆదాయంలో 50-50 వాటా తీసుకునేలా ఒక మాట అనుకున్నట్లు సమాచారం. కానీ ట్రేడ్ అనలిస్టులు వసూళ్ల ఫిగర్స్ ఘనంగా ఇస్తున్నారు కానీ.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం అధికారికంగా సరైన లెక్కలు ఇవ్వట్లేదని, నార్త్ మార్కెట్ మీద పుష్ప నిర్మాతలకు పట్టు లేకపోవడంతో వీళ్లేమీ చేయలేకపోతున్నారని.. వాటా ప్రకారం చాలా తక్కువ మొత్తమే ఇచ్చారని తెలిసింది.

ఐతే ‘పుష్ప’ ప్రొడ్యూసర్లు ఈ విషయంలో పెద్దగా ఫీల్ కావట్లేదు. ‘పుష్ప-1’కు ఆదాయం తగ్గినా.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం ‘పుష్ప-2’కు కలిసొస్తుందని.. దాని హక్కుల కోసం గోల్డ్ మైన్స్ వాళ్లు వచ్చినా.. ఇంకే సంస్థ వచ్చినా.. దానికున్న క్రేజ్‌కు తగ్గట్లు భారీ రేటే చెప్పొచ్చని.. సరిగ్గా ప్రమోట్ చేసి హైప్ ఇంకా పెంచితే రూ.70-80 కోట్ల మేర హక్కులు అమ్మొచ్చని భావిస్తున్నారట.