బాలయ్య సినిమా.. స్టోరీ లీక్..?

నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు బాలయ్య. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించనున్నారట. ‘అఖండ’ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాలో కూడా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. అందులో ఒకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర అని సమాచారం.

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండొచ్చని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథ నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని టాక్. ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాల్సిన కొన్ని పరిశ్రమలు అనివార్య కారణాల వలన వెనక్కి వెళ్లిపోతున్నాయి. నిజానికి అనంతపూర్ లో ఓ భారీ పరిశ్రమ పెట్టాలనుకున్నారు కానీ అది వేరే స్టేట్ కి వెళ్లిపోయింది. 

ఇదే నేపధ్యాన్ని.. ఫ్యాక్షన్ తో కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బాలయ్య అరవై ఏళ్ల వృద్ధుడి క్యారెక్టర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. అందరూ ఆయన్ను ‘పెద్దాయన’ అని పిలుచుకుంటూ ఉంటారట. దాన్నే టైటిల్ గా కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.