ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం ?

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అదేమిటంటే పెరిగిపోతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రచారాన్ని బ్యాన్ చేయాలని. మామూలుగా ఎన్నికలంటేనే భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు, ఊరేగింపులు, వంద రెండొందలమందితో ప్రచారం లాంటివి ఉంటాయని తెలిసిందే.

అయితే ఒకవైపు కేసుల తీవ్రత పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి వాటన్నింటికీ కమీషన్ ముగింపు పలికేసింది. ఈనెల 17 వరకున్న నిషేధాన్ని 22వ తేదీ వరకు పొడిగించింది. తర్వాత కూడా పొడిగించాలని కమీషన్ డిసైడ్ చేసిందట. ఎందుకంటే ఫిబ్రవరి నెలాఖరుకు దేశంలో కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని మొదటి నుండి వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలను వాయిదా వేయమని అలహాబాద్ హైకోర్టు సూచించింది.

అయితే హైకోర్టు సూచనతో కమీషన్ విభేదించింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు రెడీ అయిపోయింది. అందుకే ప్రచారం విషయంలో చాలా కఠినంగా ఉంటోంది. ప్రముఖ నేతల ప్రచారమంతా వర్చువల్ విధానంలోనో లేకపోతే టీవీ ఛానళ్ళు, కేబుల్ టీవీల ద్వారా మాత్రమే చేసుకోమని చెబుతోంది. కాకపోతే ఇండోర్ స్టేడియాల్లో మాత్రం 50 శాతం హాజరుతో జరుపుకోవచ్చని చెప్పింది. ఒకవైపు ఎన్నికల వేడి బాగా రాజుకుంటున్న నేపథ్యంలో 50 శాతం హాజరుతో ఇండోర్ స్టేడియంలో ఎవరు మీటింగులు పెట్టుకుంటారు.

అందుకే చాలామంది నేతలు వర్చువల్ విధానంతో పాటు సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారట. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా లైవ్ మీటింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. కారణం ఏదైనా కమీషన్ తీసుకున్న నిర్ణయం వల్ల బహుశా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బహిరంగ ప్రచారం లేకుండానే ముగిసిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల దెబ్బకు కమీషన్ మంచి నిర్ణయమే తీసుకున్నది.