‘బలుపు’ వ్యాఖ్యల వేళ.. చిరుతో జగన్ లంచ్

పిలుస్తారు.. కూర్చెబెడతారు.. మాట్లాడతారు.. తిరిగి వస్తారు. సమస్య తీరదు.. పరిష్కారం లభించదు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇష్యూస్ మొత్తం ఇదేరీతిలో సాగుతూనే ఉంటాయి. సినిమా టికెట్ల పంచాయితీ మొదలు.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

దీనికి తోడు.. ఏపీ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ఏకంగా సినిమా వాళ్లకు బలిసిందంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగుతున్నాయి. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేసినా.. చూసీచూడనట్లుగా ఉండే టాలీవుడ్.. తాజా ‘బలుపు’ మాటల విషయంలో మాత్రం రియాక్టు అవుతోంది.

తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఒకే రోజులో ముగ్గురు సినీ రంగానికి చెందిన వారు రియాక్టు కావటం.. వైసీపీ ఎమ్మెల్యేపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి మెగాస్టార్ చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ రోజు (గురువారం)మధ్యాహ్నం భోజన విరామ సమయంలో చిరంజీవితోకలిసి భోజనం  చేస్తారని చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చర్చించే వీలుందని చెబుతున్నారు.

అన్నింటికి మించి సినిమా టికెట్ల వివాదంపై వీరి మధ్య చర్చ జరుగుతుందని చెబుతున్నారు. రోజురోజుకీ వివాదం ముదిరిపోతున్న వేళ.. దీనికి పుల్ స్టాప్ పెట్టేందుకే చిరంజీవి ఒక అడుగు ముందుకు వేసినట్లుగా చెబుతున్నారు. తమ భేటీలో భాగంగా.. సినీ పరిశ్రమపై వైసీపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల ప్రస్తావన కూడా వస్తుందన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న సినీ రంగానికి పెద్దగా తాను వ్యవహరించనని చెప్పిన చిరంజీవి.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.