నాగార్జున‌కు జ‌గ‌న్ గిఫ్ట్!

ప్ర‌స్తుతం సినిమాల విడుద‌ల‌కు ప‌రిస్థితులు ఏమంత ఆశాజ‌న‌కంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌న బంగార్రాజు సినిమాను సంక్రాంతి బ‌రిలో నిలిపాడు అక్కినేని నాగార్జున‌. ఇది ప‌ర్ఫెక్ట్ ఫెస్టివ‌ల్ మూవీ కావ‌డం.. సంక్రాంతికే వ‌చ్చి ఘ‌న‌విజ‌యం సాధించిన సోగ్గాడే చిన్నినాయ‌నాకు సీక్వెల్‌గా తెర‌కెక్క‌డం.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో నాగ్ బంగార్రాజును సంక్రాంతికి రిలీజ్ చేసే తీరాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు.

అందుకు త‌గ్గ‌ట్లే కాస్త క‌ష్ట‌మైనా స‌రే.. సంక్రాంతికి సినిమాను రెడీ చేశాడు. ఐతే బంగార్రాజు రిలీజ్ ఖ‌రారైన వెంట‌నే చేదు వార్త వినాల్సి వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ అనౌన్స్ చేసింది ప్ర‌భుత్వం. దీంతో థియేట‌ర్ల‌లో సెకండ్ షోలు వేసుకునే అవ‌కాశం లేక‌పోయింది. అలాగే థియేట‌ర్ల‌ ఆక్యుపెన్సీని కూడా 50 శాతానికి త‌గ్గించేయ‌డంతో బంగార్రాజుపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ ప‌రిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి నాగ్ రిస్క్ చేస్తున్నాడ‌నే అనిపించింది. కానీ నాగ్ త‌న‌కు స‌న్నిహితుడైన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ్య‌క్తిగ‌తంగా విన్న‌ప‌మేదైనా చేశాడా.. మంత్రుల‌ను సంప్ర‌దించాడా.. లేక ప్ర‌భుత్వ పెద్ద‌లే అర్థం చేసుకుని వెన‌క్కి త‌గ్గారా తెలియ‌దు కానీ.. ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ వాయిదా వేశారు. సంక్రాంతి పండుగ త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది అక్క‌డి ప్ర‌భుత్వం.

జ‌నాల పండుగ సంతోషాన్ని దెబ్బ తీయ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే నైట్ క‌ర్ఫ్యూను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిజానికి రాత్రి 11 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ పెట్ట‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ది వాస్త‌వం. ఆ టైంలో జ‌నాలు మామూలుగానే బ‌య‌ట తిర‌గ‌రు. పేరుకు క‌ర్ఫ్యూ ఉంటుంది త‌ప్ప దాన్ని క‌ఠినంగా అమ‌లు చేయ‌డ‌మూ త‌క్కువే. అలాంట‌పుడు సినిమాల‌ను దెబ్బ తీయ‌డానికి త‌ప్ప నైట్ క‌ర్ఫ్యూ వ‌ల్ల ఒన‌గూరేదేంటి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.