మ‌రోసారి రెచ్చిపోయిన బండి

తెలంగాణ బీజేపీ సార‌థి బండి సంజ‌య్ మ‌రోసారి రెచ్చిపోయారు. కేసీఆర్‌కు వార్నింగుల‌పై వార్నింగులు సంధించారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్ విర్రవీగుతున్నారని, కొమ్ములు విరిచేస్తామ‌ని హెచ్చ‌రించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని ఈ విష‌యం గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జైలుకు వెళ్లడం తమకు కొత్తేమీ కాదన్నారు.

హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మరోసారి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 317 జీవోతో ఉద్యోగులను సీఎం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని నిప్పులు చెరిగిన సంజయ్‌… పోరాటానికి అండగా ఉంటామని ప్రధాని ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని వెల్లడించారు. 317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ సభ పెడతామని సంజయ్‌ పేర్కొన్నారు. కేసీఆర్ త‌ప్పుల‌ను ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుంటామ‌న్నారు. ప్ర‌జ‌ల బ‌లం త‌మ‌కు ఎప్పుడూ ఉంద‌ని.. ఈ విష‌యం కేసీఆర్ తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

“ప్రధాని నరేంద్ర మోడీ నాకు ఫోన్ చేశారు. మీరు పోరాడుతున్న తీరు అద్భుతమని కొనియాడారు. మనకు అండగా ఉంటామన్నారు. 317 జీవో విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉండమని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు త్యాగాలు కొత్తకాదని ప్ర‌ధానికి చెప్పా. ఉద్యోగులకు, కార్యకర్తలకు భరోసా ఇవ్వమన్నారు. దేశ ప్రధాని మామూలు కార్యకర్తకు ఫోన్ చేసిండంటే అది కమిట్‌మెంట్. ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేయడు కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే. మేం ఒక లక్ష్యం అనుకున్నాం. 2023లో గోల్కొండ కోట ఖిల్లాపై కాషాయపు జెండా ఎగురవేస్తాం.“ అని కార్య‌క‌ర్త‌ల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య బండి వ్యాఖ్యానించారు.