గట్టి అభ్యర్ధుల కోనం టీడీపీ వేట

తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధుల కోసం వేట మొదలుపెట్టింది. తొందరలోనే 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ కారణాలతో 22 మున్సిపాలిటీలకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. కాలపరిమితి ముగియని కారణంగా, కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 22 మున్సిపాలిటీలకు తొందరలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇదే విషయమై చంద్రబాబు నాయుడు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

ఎన్నికలు జరగాల్సిన 22 మున్సిపాలిటీల పరిధిలోని నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రత్యర్ధులకు లొంగిపోని గట్టి నేతలనే బరిలోకి దింపాలని స్పష్టంగా చెప్పారు. ప్రత్యర్ధుల ఒత్తిళ్ళకు లొంగిపోవటం, కోవర్టులుగా పనిచేయడం, సొంత పార్టీనే దెబ్బ కొట్టేట్లుగా వ్యవహరిస్తున్న నేతలను గుర్తించి దూరంగా పెట్టాలని ఆదేశించారు.  గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని కొందరు నేతలు కావాలనే దూరం పెట్టి తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారంటు మండిపడ్డారు.

ఇపుడు అలాంటి వ్యవహారాలను జాగ్రత్తగా గమనించి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న నేతలను దూరంగా పెట్టమని చంద్రబాబు చెప్పారు. పార్టీ ఓట్లను తొలగించటం, దొంగ ఓట్లను ప్రోత్సహించటం లాంటి చర్యల వల్లే వైసీపీ లాభపడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన తప్పులను రాబోయే ఎన్నికల్లో పునరావృతం చేయకూడదని సీరియస్ గానే చెప్పారు.

మరి చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఎంతవరకు అమలవుతాయో చూడాల్సిందే. ఎందుకంటే చాలా చోట్ల పార్టీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. కొన్ని  నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేరు. ఇలాంటి చోట్ల పార్టీ కార్యక్రమాలు జరగటం లేదు. ఖర్చులకు వెనకాడటం, ఇపుడు కార్యక్రమాలు నిర్వహించినా రేపు టికెట్ దక్కుతుందనే నమ్మకం లేకపోవటం లాంటి అనేక కారణాలతో నేతలు దూరంగా ఉంటున్నారు.

22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడమంటే మామూలు విషయం కాదు. దాదాపు 22 నియోజకవర్గాలన్నట్లే లెక్క. 22 నియోజకవర్గాలంటే ప్రభుత్వం పై ప్రజాభిప్రాయం చెప్పే అవకాశం రావటమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైన తర్వాత జరగబోయే ఎన్నికల్లో ప్రజా స్పందన ఎలాగుంటుందనే విషయం ఆసక్తిగా మారింది. మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఫలితాలెలా ఉంటుందో చూడాల్సిందే.