‘పుష్ప’ వృధా ఖర్చు.. అన్ని కోట్లా?

2021లో విడుదలైన ‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్’ కోసం రూ.180 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా సన్నివేశాలను ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేశారు.

అలా డిలీట్ చేసిన సన్నివేశాలకు ఖర్చు పెట్టిన మొత్తమెంతో తెలుసా..? రూ.12 కోట్లు. ఓ భారీ యాక్షన్ సీన్ ను కూడా డిలీట్ చేసేసారట. పోనీ ఈ సన్నివేశాలను సెకండ్ పార్ట్ కోసం వాడతారా అంటే.. అది కూడా చేసే ఛాన్స్ లేదట. దీంతో వేస్టేజ్ పార్ట్ చాలా ఎక్కువైందని సమాచారం. అలా డిలీట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తుంది నిర్మాణ సంస్థ.

కొన్ని సన్నివేశాలనైతే ఎడిట్ కూడా చేయకుండా అలానే వదిలేశారట. ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడమంటే మాములు విషయం కాదు. రోజుకి ప్రొడక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. ‘పుష్ప’ సినిమా విషయంలో ఎన్ని రోజులు వేస్ట్ అయిందో కానీ మొత్తంగా రూ.12 కోట్ల విలువ చేసే సన్నివేశాలను డస్ట్ బిన్ లో వేసేశారు. ముందే ల్యాగ్ ఎక్కువ లేకుండా చూసుకొని ఉంటే ఈ వేస్టేజ్ కాస్ట్ తగ్గి ఉండేది.

మరి ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2 కోసం ఎంత బడ్జెట్ ను వెచ్చిస్తారో చూడాలి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సెకండ్ పార్ట్ మొత్తం అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ చుట్టూ తిరగనుంది. అలానే అనసూయ, సునీల్ ల పాత్రలకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వబోతున్నారు. రష్మిక రోల్ కి సెకండ్ పార్ట్ లో పెద్దగా సీన్లు లేనప్పటికీ.. మళ్లీ రీరైట్ చేసి ఆమె స్క్రీన్ స్పేస్ ను పెంచుతున్నట్లు తెలుస్తోంది.